పోతిరెడ్డిపాడుపై వైయస్తో కుమ్మక్కు: హరీష్పై జగ్గారెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెల్ల కాగితంలాంటి వాడని ఆయనను మురికి ముఖ్యమంత్రి అంటూ హరీష్ రావు విమర్శించే ముందు, తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నారు. పోతిరెడ్డిపాడు విషయంలో వైయస్తో కుమ్మక్కయినట్లు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. సింగూరు ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా కర్ణాటక ప్రభుత్వం ఎగువన చెక్ డ్యామ్లను నిర్మిస్తున్నా తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గానీ, హరీష్ రావు గానీ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
మెదక్ జిల్లా రైతాంగం దీనావస్థలో ఉంటే తాము మాత్రం రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్, హరీష్ రావులను మెదక్ జిల్లా రైతాంగం నిలదీసే రోజు వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టామంటున్న తెరాస ఈ ప్రాంత ప్రజల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఏనాడైనా పోరాడిందా అని నిలదీశారు. పుట్టినప్పటి నుంచి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు మినహా ప్రజా సమస్యల పరిష్కారానికి తెరాస ఏనాడూ కృషి చేయలేదన్నారు.
తెలంగాణ రైతాంగానికి అవసరమయ్యే ప్రాజెక్టుల నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నించలేదని ఆరోపించారు. కిరణ్ రెండు ప్రాంతాలకూ ఉపయోగపడే పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కేలా కృషి చేస్తున్నారని అన్నారు. పోలవరం నిర్మాణం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకు 45 టీఎంసీల నీరు లభిస్తుందని వెల్లడించారు. ఇవేమీ పట్టించుకోకుండా ఎంతసేపూ సెటిల్మెంట్ రాజకీయాలు చేస్తూ ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించడం తగదని హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం టెండర్లు తెలంగాణ పత్రిక అధినేతకు దక్కలేదన్న దుగ్ధతోనే హరీష్ రావు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇంజనీర్ల బృందం ఏ హోటల్లో దిగిందో ఎంత సెటిల్ చేసుకుందో హరీష్ రావుకు, టిడిపి నేతలకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. అంటే వారు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారా? అని నిలదీశారు. హరీష్ రావు మాటలు విని తెలంగాణ నేతలు ఆయనను చిల్లర నాయకుడని అనుకుంటున్నారని అన్నారు.