వైయస్, ఎన్టీఆర్ ఫ్యామిలీల్ని పోల్చుకోండి: చంద్రబాబు
ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల మాట్లాడారు. ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే నెత్తిమీద జుట్టు కూడా మిగలదని విమర్శించారు. పాదయాత్రలో పలువురిని చంద్రబాబు పలుకరించి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెరిగిన ధరలు, అవినీతిపై బాబు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పైన నిప్పులు చెరిగారు.
వచ్చే ఏడాది పార్టీకి కీలకమని, ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని కాబట్టి ఈ ఏడాదంతా ఇంటి పనులు ఎవరికైనా వదిలేసి పార్టీకి అంకితం కావాలని సూచించారు. ఇప్పటికే బాగా అలసిపోయారని, చాలా ఖర్చు పెట్టుకుని వట్టిపోయారని తనకు తెలుసునని అయినా తప్పదన్నారు. కాస్తో కూస్తో మీ స్థోమతను బట్టి ఇంకో ఏడాది పార్టీని భరించాల్సిందేనని సూచించారు. అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీదని, మీ బాగోగులు చూసుకునే బాధ్యత తనదని గుడివాడ కార్యకర్తల భేటీలో చంద్రబాబు అన్నారు.
ఎందుకూ పనికిరాని వారికి కూడా సీటిచ్చి గెలిపిస్తే వారు డబ్బుకు అమ్ముడుపోయి, పార్టీని, పార్టీ అధినేతను నోటికొచ్చినట్టు తిడుతున్నారని కార్యకర్తలు బాబు వద్ద వాపోయారు. ఇకనైనా పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసుకుని విధేయులకే సీటివ్వాలని వారు బాబును కోరారు.