మీ లాగా తిట్టనంటూనే బిజెపిని కడిగేసిన మన్మోహన్
న్యూఢిల్లీ: 'మీలాగా నేను తిట్టను' అంటూనే బిజెపి ప్రధాని మన్మోహన్ సింగ్ కడిగి పారేశశారు. సున్నితమైన మాటలతోనే బిజెపిపై విమర్శలు కురిపించారు. వ్యంగ్య బాణాలతో విరుచుకుపడ్డారు. అక్కడక్కడా ఉర్దూ కవితలను ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని సాగించారు. తాము తక్కువ తినలేదంటూ బిజెపి నాయకులు కూడా 'కవితలకు కవితలతోనే' సమాధానమిచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం ప్రధాని లోక్సభలో మాట్లాడారు. ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్పై విరుచుకుపడటం, ప్రధానిని నైట్వాచ్మన్గా అభివర్ణించడం తెలిసిందే. దీనికి మన్మోహన్ ఘాటుగా బదులిచ్చారు. 'వారి నుంచి విశ్వాసం ఆశిస్తున్నాం. కానీ... వారికి విశ్వాసమంటే ఏమిటో తెలియదు' అంటూ బిజెపిపై ఘాటైన వ్యాఖ్య చేశారు.
'కమలానికి పొగరు ఎక్కువ' అని విమర్శించారు. "నేను మీ తరహా భాషను ప్రయోగించను. నిజానికి... గర్జించే మేఘాలు వర్షించవు. బీజేపీ ఇలా తలబిరుసు ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. దీనిని వదులుకోకుంటే... ఎన్డీయేకు మళ్లీ ఓటమి తప్పదు'' అని ప్రధాని హెచ్చరించారు. 2009 ఎన్నికల ముందు తనను 'బలహీన ప్రధాని' అంటూ నిందించిన అద్వానీకి అదను చూసుకుని చురకలు అంటించారు. "2009లో ఉక్కు మనిషిని రంగంలోకి దించారు. ఏం జరిగిందో అందరికీ తెలుసు. 2004 ఎన్నికల సమయంలో భారత్ వెలిగిపోతోందంటూ ప్రచారం చేశారు. కానీ... వారే ఆరిపోయారు'' అని మన్మోహన్ ఎద్దేవా చేశారు. అద్వానీని ఉద్దేశించి ఉక్కు మనిషి అనే ప్రయోగం చేశారు. అద్వానీ నాయకత్వంలో బిజెపి రెండు సార్లు ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు.

ఏ విధంగా చూసినా ఎన్డీయేకంటే తామే మెరుగైన పాలన అందించామని, అభివృద్ధి సాధించామని చెప్పేందుకు గణాంకాల చిట్టా విప్పారు. "యూపీఏ హయాంలోని తొమ్మిదేళ్లలో సగటున 7.9 శాతం వృద్ధి సాధించాం. ఎన్డీయే హయాంలో అది 6 శాతానికి మించలేదు. నిజానికి... యూపీఏ సాధించిన వృద్ధిని గతంలో ఏ ప్రభుత్వమూ సాధించలేదు. 12వ ప్రణాళిక కాలంలో 8% వృద్ధిరేటు సాధించాలన్నది మా లక్ష్యం'' అని ఉద్ఘాటించారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం మన దేశానికి ఎప్పుడూ సమస్యగానే ఉందని ఆయన అంగీకరించారు. ఇతర దేశాలతో పోలిస్తే మన పరిస్థితి మెరుగ్గానే ఉన్నా కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications