బతకాలని ఉంది: చావెజ్ చివరి మాట, గుండెనొప్పి వల్లే
వెనిజులా: ఇటీవల మృతి చెందిన వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావేజ్ మృతికి తీవ్రమైన గుండెపోటు కారణమని ఆయన భద్రతాధికారులు చెప్పారు. జనరల్ జోస్ ఒర్నెల్లా అనే అధికారి చావెజ్ చివరి ఘడియల్లో ఆయన పక్కనే ఉన్నారట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. చావేజ్ చివరి ఘటియాల్లో తాను అక్కడే ఉన్నానని, గట్టిగా మాట్లాడలేక పోయిన చావెజ్ తనకు చావాలని లేదని చివరిసారిగా చెప్పారని తెలిపారు.
తనను బతికించమని నెమ్మదిగా చెప్పారని ఒర్నెల్లా తెలిపారు. రెండేళ్లుగా చావెజ్ క్యాన్సర్తో జరిపిన పోరుకు తాను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పారు. చావేజ్ దేశాన్ని ఎంతగానో ప్రేమించారని, దేశం కోసం ఎంతో త్యాగం చేశారని ఒర్నెల్లా పేర్కొన్నారు. చావేజ్ మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన మిలిటరీ ఆకాడమీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల ఆయన మృతి చెందారని అంతకుముందు ప్రభుత్వం ప్రకటించింది.
కాగా, గత కొంత కాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్(58) బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కరాకన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావెజ్ మృతి చెందాడు. ఆయన మృతితో చమురు దేశం వెనిజులా దిక్కు లేకుండా పోయింది. 1998లో తొలిసారిగా వెనుజులా అధ్యక్షుడిగాచావెజ్ ఎన్నికయ్యాడు.

చావెజ్ 14 ఏళ్లకు పైగా వెనుజులాను పాలించాడు. అత్యంత ప్రభావశీలిగా ప్రఖ్యాతి వహించిన చావెజ్ దాదాపు మూడు నెలల పాటు ప్రజల ముందుకు రాలేదు, ఏమీ మాట్లాడలేదు. క్యూబాలో క్యాన్సర్కు రెండు నెలల పాటు చికిత్స చేయించుకున్న తర్వాత మిలిటరీ ఆస్పత్రిలో చేరాడు. గత ఏడాదిన్నర కాలంలో ఆయన నాలుగో విడత క్యాన్సర్కు చికిత్స చేయించుకున్నారు. చావెజ్ మృతితో లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications