అవిశ్వాసం: చంద్రబాబు దూరం, కిరణ్ రెడ్డికి ఊరట
బుధవారం ఉదయం 9.30 గంటలకు పాత అసెంబ్లీ భవన్లో ఉభయ సభల సయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పడంతో రాజకీయం ఒక్కసారిగా వేడి పుట్టింది.
అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు నిర్ణయించుకుంది. సిపిఐ కూడా అదే నిర్ణయం తీసుకుంది. ప్రజా సమస్యలపై అవిశ్వాసం పెడితే మద్దతిస్తామ సిపిఎం తెలిపింది. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైఖరిపైనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. 'కేసీఆర్ది పక్కా రాజకీయ వ్యూహం. ఆ వలలో మనం పడకూడదు' అని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. దీంతో పరిస్థితి తారుమారైంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇచ్చినా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేదని టిడిపి చెబుతోంది.
స్పీకర్ను మినహాయించగా... మిగిలిన 293 మంది సభ్యుల్లో ఒక టీడీపీ సభ్యుడికి ఓటు హక్కులేదు. లోక్సత్తా నేత ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ తటస్థంగా ఉంటూ వస్తోంది. మిగిలింది 291 మంది. ఇందులో విపక్ష బలం 143 కాగా, అధికారపక్ష బలం 148. జగన్వైపు మొగ్గు చూపిన వారిపై కాంగ్రెస్ అనర్హత వేటు వేస్తే విపక్షం బలం మరింత పడిపోతుంది. ఏ విధంగా చూసినా ప్రభుత్వానికి ఢోకా ఉండదు. కాంగ్రెస్లో బలమైన చీలిక వస్తే మినహా ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలేదు.
బుధవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్నాళ్లు జరగాలో, ఏయే అంశాలపై చర్చించాలో నిర్ణయిస్తారు. అవిశ్వాస తీర్మానంపైనా చర్చించే అవకాశముంది. మంగళవారం స్పీకర్తో సభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమావేశమై చర్చించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, కాసు వెంకట కృష్ణారెడ్డి, ఎన్. ఉత్తమకుమార్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహం, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడంపై చర్చ జరిగినట్లు సమాచారం.
మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ను కలిశారు. బుధవారం చేయనున్న ప్రసంగాన్ని విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించే అవకాశముందని, విపక్షాల గురించి పట్టించుకోవద్దని గవర్నర్ను ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిసింది.