ఉంటారా?వెళ్తారా?: జగన్ వర్గంపై కిరణ్కి కోపమొచ్చింది
ఉంటే ఉండండి.. లేదా వెళ్లిపోండి. అంతేకానీ పార్టీలో ఉంటూ నష్టం చేయవద్దని హెచ్చరించారట. పార్టీ విధానాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని లేదంటే వెళ్లిపోవచ్చని సూచించారట. పార్టీలో ఉంటూ నష్టం చేస్తున్న వారి పైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి పలువురు సూచించారు. వారితో కిరణ్ ఏకీభవించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్న వైయస్సార్ కాంగ్రెసుతో పాటు ఇతర ప్రత్యర్థులపైనా విరుచుకుపడాలని పార్టీ ఎమ్మెల్యేలకు కిరణ్ పిలుపునిచ్చారు. జగన్ ఒక్కడినే లక్ష్యం చేసుకోవాలన్నట్లుగా అంతా మాట్లాడుతున్నారని కానీ, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే విపక్షాలను లక్ష్యంగా చేసుకోవాల్సిందేనని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయ్యాయని జగన్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకపోయామని కిరణ్ అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక తెలంగాణ కోరుతున్న తెరాస ప్రతిపాదించిన తీర్మానానికి జగన్ పార్టీ ఎలా మద్దతిచ్చిందని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని మనం ఎందుకు ప్రచారం చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పార్టీ అధినేతలపై విమర్శలు గుప్పిస్తున్న వారిని క్షమించేందుకు వీల్లేదని తక్షణమే ప్రతి విమర్శలు చేయాల్సిన అవసరం ఉందని పాలడుగు వెంకట్రావు చేసిన సూచనను బలపరిచారు.