సంకెళ్లతో తెరాస ఎమ్మెల్యేలు: అసెంబ్లీ వాయిదానే
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి ప్రమేయంతోనే ఈటెల రాజేందర్, కోదండరామ్, జూపల్లి కృష్ణారావుల అరెస్టు జరిగిందని తెరాస శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. తమ పార్టీ శాసనసభ్యుల అరెస్టుపై స్పీకర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక శాసనసభా పక్ష నేత అరెస్టు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆయన అన్నారు.
విద్యుత్ సమస్యపై సభలో చర్చించాలని డిమాం చేస్తూ తెలుగుదేశం పార్టీ శానససభ్యులు ఎన్టీఆర్ ఘాట్ నుంచి అసెంబ్లీకి పాదయాత్రగా వచ్చారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న శానససభ్యులు ఎన్టీఆర్కు నివాళులు అర్పించారు. అనంతరం ట్యాంక్బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగించారు.
శాసనసభ సమావేశం కాగానే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ప్రతిపక్షాల ఆందోళనతో శనివారం శానససభ కార్యక్రమాలు స్తంభించాయి. దీంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభలో పరిస్థితి సద్దుమణగలేదు. దాంతో మరోసారి సభ అర గంట పాటు వాయిదా పడింది.
రాజకీయ ప్రయోజనం కోసమే ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నాయని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.