8న్నర గంటలు కెవిపికి ప్రశ్నలు, ఇంటి భోజనం
తనకు అందిన నోటీసులకు అనుగుణంగా విచారణ అధికారులు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసిన సమాధానాలు చెప్పానని దిల్కుషా అతిథి గృహం వద్ద మీడియాకు వివరించారు. సిబిఐ తనను వివరాలు అడిగిందని, తాను తనకు తెలిసిన వివరాలు చెప్పానని, విచారణలో భాగంగానే సిబిఐ తనను పిలిచిందని ఆయన చెప్పారు. సిఆర్పీసి సెక్షన్ 160 కింద సాక్షిగా తనను సిబిఐ విచారణకు పిలిచిందని ఆయన చెప్పారు.
కెవిపికి భోజనం కూడా ఇంటినుంచి అతిథి గృహానికే వచ్చింది. అయితే సాయంత్రం ఆయన ఇంటికి వెళ్లవచ్చునని సిబిఐ అధికారులు చెప్పారు. విచారణ అధికారులకు సాయం చేయడానికి వచ్చానని ఆయన వివరించారు. పూర్తిగా సిబిఐకి సహకరిస్తానని ఆయన చెప్పారు. మళ్లీ రమ్మన్నారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. ఇంకా సిబిఐ ఏం ప్రశ్నించిందన్న ప్రశ్నకు వారు అడిగినవాటన్నిటికీ సమాధానాలు చెప్పానని మాత్రమే ఆయన వెల్లడించారు. కెవిపి బినామీ ఆస్తులు కృష్ణమోహన్ దగ్గర ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడానికి ఇరువురినీ ఎదురెదురుగా కూర్చోపెట్టి సిబిఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కెవిపి మిత్రుడు కృష్ణమోహన్ను సిబిఐ శుక్రవారంనాడు కూడా ప్రశ్నించినట్లు సమాచారం.
సిఆర్పీసి సెక్షన్ 160 కింద కెవిపిని పిలిపించామని ఆయన వెల్లడించారు. సాక్షిగానే కెవిపిని విచారించామని, అవసరమైతే మళ్లీ పిలుస్తామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ మీడియా ప్రతినిధులతో చెప్పారు.కెవిపిని ఏం అడిగారు, ఆయన ఏం చెప్పారన్న ప్రశ్నలకు ఆయన వాంగ్మాలం ఇచ్చారని, తమవద్ద ఉన్న సమాచారంతో ఆ సమాచారాన్ని పోల్చి చూసుకుంటామని ఆయన వివరించారు.
మళ్లీ పిలిపిస్తారా అని అడగగా, అవసరమైతే మళ్లీ విచారణకు పిలిపిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం నుంచి కొన్ని వివరాలు వచ్చాయని, మరికొన్ని వివరాలు రావల్సి ఉందని, వాటి వివరాల కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని లక్ష్మినారాయణ చెప్పారు. కొత్తగా ఎవరికీ నోటీసులు ఇవ్వలేదని జేడీ స్పష్టం చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలు వెబ్సైట్లో ఉన్నాయని, కావాలంటే చూసుకోవచ్చునని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, సిబిఐ జెడి లక్ష్మినారాయణను తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు శ్రీ రంగారావు, మోహనరావు తదితరులు శనివారం కలుసుకున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా చెప్పుకునే కెవిపి రామచంద్రరావుపై ఆయనకు ఫిర్యాదు చేశారు. కెవిపి అక్రమాలు, అన్యాయాలు, కుంభకోణాలకు సంబంధించి తమ వద్ద పలు ఆధారాలున్నాయని వారు జేడీకి తెలిపారు. త్వరలోనే వాటిని సీబీఐకి అందజేస్తామని చెప్పారు. చట్టప్రకారం కేవీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.