తెలంగాణ: తెరాసపై కిరణ్ ఎదురుదాడి, హరీష్ ఫైర్

శానససభలో తెలంగాణపై తీర్మానం చేయడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. కేంద్రం నిర్ణయం ప్రకారం తాము తెలంగాణపై వ్యవహరిస్తామని ఆయన చెప్పారు. దేశానికి, రాష్ట్రానికి ఏది ప్రయోజనం కలిగిస్తుందో ఆ నిర్ణయం కేంద్రం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తెలంగాణ ఇస్తామని గానీ ఇవ్వబోమని గానీ కాంగ్రెసు చెప్పలేదని ఆయన అన్నారు. ఒక్కోసారి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్పి ఉండవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకునేదాకా వేచి చూడాలని ఆయన అన్నారు.
తెలంగాణపై కేంద్రం శానససభలో తీర్మానం చేయాలని కేంద్రం సూచించిన మాట నిజమేనని, అయితే ఇతర ప్రాంతాల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన చెప్పారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము కూడా కేంద్రాన్ని కోరుతున్నామని ఆయన చెప్పారు. పార్లమెంటు సమావేశాల తర్వాత కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై అందరి నిర్ణయం తీసుకున్న తర్వాతనే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల విభజన కూడా ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే జరిగిందని ఆయన అన్నారు. అంత దాకా ఆగాలని ఆయన అన్నారు.
గులాబీ కుండవా కప్పుకున్నప్పుడే..
సోనియా, గులాం నబీ ఆజాద్ గులాబీ కండువా కప్పుకున్నప్పుడే తెలంగాణ ఇస్తారని అనుకున్నామని హరీష్ రావు అన్నారు. ఆజాద్ కెసిఆర్ ఇంటికి వచ్చి తెలంగాణపై చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్య త్వరగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని చెప్పారని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణపై శానససభలో తీర్మానం చేద్దామని ఆయన కోరారు. తెలంగాణ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతూ తీర్మానం చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారని ఆయన అడిగారు.
తెరాస రెండో ఎస్సార్సీకి అంగీకరించింది...
తెలంగాణ ఇస్తామని ప్రైవేట్ టాక్స్లో ఎవరైనా చెప్పారేమో తనకు తెలియదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రెండో ఎస్సార్సీకి అంగీకరిస్తూ సంతకం చేసినట్లు అప్పటి తెరాస నాయకుడు నరేంద్ర చెప్పారనేది నిజం కాదా అని ఆయన అడిగారు. తెరాస రెండో ఎస్సార్సీకి అంగీకరించిందని ఆయన అన్నారు. తెరాసకు ఒక్క ప్రాంతంలోనే ప్రాతినిధ్యం ఉందని, తమకు అన్ని ప్రాంతాల్లో ఉందని, తెలంగాణపై తీసుకునే నిర్ణయం దేశమంతటా ప్రభావం చూపుతుందని, తాము దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి తెలంగాణపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ జఠిలమైన అంశమని, తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రం ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. నిర్ణయం తీసుకునే వరకు వేచి చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
రెండో ఎస్సార్సీ ఇతర ప్రాంతాలకే అన్నారు...
తెలంగాణపై కాంగ్రెసు నాయకులు పూటకో మాట మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు దేశపరిస్థితులు గుర్తు లేవా అని ఆయన అడిగారు. అధికారంలోకి వస్తే తెలంగాణపై తాము నిర్ణయం తీసుకుంటామని ప్రణబ్ ముఖర్జీ చెప్పారని ఆయన గుర్తు చేశారు. తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు దేశపరిస్థితులు గుర్తు లేవా, ఓట్లూ సీట్లూ మాత్రమే కావాలా అని ఆయన అడిగారు.
తెలంగాణపై తమతో పొత్తు పెట్టుకున్నప్పుడే నిర్ణయం తీసుకోవాల్సి ఉండిందని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీకి తాము అంగీకరించినట్లు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యకు ప్రతిస్పందిస్తూ - అప్పటి పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేసి, రెండో ఎస్సార్సీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు మాత్రమేనని, అది తెలంగాణకు వర్తించదని చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. అలా అయితే ఇప్పటికే ఎస్సార్సీ వేయకుండా కాంగ్రెసు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన అడిగారు. మరిన్ని ఆత్మహత్యలు జరగకముందే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేద్దామని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications