జగన్ని కలువనున్నకాంగ్రెస్ ఎమ్మెల్యే: టిక్కెట్పై హామీ!

ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సమంయలో జోగి రమేష్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయం తెలిసిందే. ఆఖరు నిమిషం వరకు తాను ప్రభుత్వానికి అండగా ఉంటానని చెప్పిన జోగి రమేష్ చివరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు లేచి నిలబడి కాంగ్రెసుకు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన తాను జగన్ పార్టీలోకి వెళ్తానని ప్రకటించారు కూడా. జోగికి జగన్తో కలిసే అవకాశం రావడంతో అతనికి పార్టీ నుండి పెడన ఎమ్మెల్యే టిక్కెట్ పైన హామీ లభించి ఉంటుందంటున్నారు.
పది రోజుల క్రితం జోగి మాట్లాడుతూ.. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నానని జోగి చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున పెడన నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఇన్నాళ్ళూ కాంగ్రెస్ పార్టీలో ఉండి పొరపాటు చేశానని, కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన వైయస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ముప్పేట దాడి జరుగుతుంటే తట్టుకోలేక పోయానని చెప్పారు. శాసన సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా వైయస్ పైన, ఆయన కుటుంబం పైన అన్ని పార్టీలు మూకుమ్మడిగా చేసిన దాడి తన మనసును కలచి వేసిందన్నారు.
ఈ దాడిని తట్టుకోలేకే అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేశానన్నారు. తాను ఈ పాటికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్ళవలసి ఉందన్నారు. ఆలస్యంగా వెళ్ళి పొరపాటు చేశానన్నారు. ఇప్పటికైనా వెళ్ళి తప్పును సరిదిద్దుకున్నానన్నారు. కాంగ్రెస్కు రాష్ట్రంలో నూకలు చెల్లాయనుకుంటున్న తరుణంలో వైయస్ మండుటెండలో పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువచ్చారన్నారు.
వైయస్ చలువ వల్లే కాంగ్రెస్ నేడు అధికారంలో ఉందన్నారు. పెడన టికెట్ ఇచ్చి తనను ఎమ్మెల్యేను చేసిన వైయస్కు ఎప్పటికీ రుణ పడి ఉంటానని జోగి అన్నారు. వైయస్ను ఆదర్శంగా తీసుకుని పెడన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. మళ్ళీ పెడన నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేనవుతానని ఆయన స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ 180 నుంచి 200 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందన్నారు. వైయస్ కుటుంబానికి ప్రజలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications