జగన్ పార్టీలో చిచ్చు: మైసూరా ముందే బాహాబాహీ
ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లాలో మైసూరా సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటిసి, పార్టీ సీనియర్ నేత శ్రీనివాస రావు ఒక్కసారిగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ ప్రారంభం నుండి తాము ఉంటున్నామని, అలాంటి తమను వదిలేసి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడమేమిటని మైసూరాను నిలదీశారు. ఆయన ఎమ్మెల్యే అనే ఉద్దేశ్యంతోనే అంత ప్రాధాన్యత ఇస్తారా అని ఘాటుగానే స్పందించారు.
శ్రీనివాస రావుకు మద్దతుగా ఆయన వర్గం నిలబడింది. తాము అందరికంటే ముందుగా పార్టీలోకి వచ్చామని, జిల్లాలో నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డామని అలాంటి తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్యే మద్దాల రాజేష్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దీంతో మద్దాల రాజేష్ వర్గం ఎదురు దాడికి దిగింది. ఇది చిలికి చిలిక వాన అయింది. దీంతో మైసూరా సమావేశాన్ని వాయిదా వేశారు.
దీంతో మరింత ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీనివాస రావు వర్గీయులు మీ దృష్టికి సమస్యను తీసుకు వస్తే తీర్చుతారనుకుంటే సమావేశాన్ని వాయిదా వేయడమేమిటని ప్రశ్నించారు. మొదట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వని పక్షంలో పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
మరికొందరు అదే బాటలో....
మద్దాల రాజేష్, శ్రీనివాస రావు మధ్యనే కాకుండా మరికొందరి మధ్య కూడా ఈ సమావేశంలో ఆధిపత్య పోరు కనిపించింది. ఆళ్ల నాని వర్గంపై బుద్దాని వర్గం, నిడదవోలులో జక్కంశెట్టి బ్రదర్స్, దెందులూరులో సంజయ్లు తమ అసంతృప్తిని ప్రకటించారు. మొదట వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.