వైయస్ జగన్ ఆస్తుల కేసులో రేపు మరో ఛార్జీషీట్
ఈ ఛార్జీషీటు దాఖలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఆఖరు ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్ ఛార్జీషీట్ ముందు దాఖలు చేయనున్న చార్జీషీట్ ఇది. ఇటీవల కెవిపి రామచంద్ర రావు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితరులను సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. వీరు చెప్పిన అంశాలను బట్టి జగన్ వ్యవహారం పైనే ఈ చార్జీషీట్ ఉండవచ్చునని భావిస్తున్నారు.
జగన్ కేసులో ఛార్జీషీటు విషయంలో సిబిఐ జాప్యం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు చేస్తుండగా.. సిబిఐ మాత్రం తమకు సుప్రీం కోర్టు ఎలాంటి తుది గడువు విధించలేదని, కేసు క్లిష్టమైనదని, కాబట్టి విచారణకు కొంత సమయం పడుతుందని చెబుతోంది. ఇప్పుడు ఛార్జీషీట్ దాఖలు చేసినా కొద్ది రోజుల తర్వాత ఫైనల్ ఛార్జీషీట్ దాఖలు చేసే విషయమై కూడా పూర్తిగా స్పష్టత లేదనే చెప్పవచ్చు.
ఇటీవల కెవిపి రామచంద్ర రావు, వైయస్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రమేష్ రెడ్డి, దశరథ రామిరెడ్డి తదితరులను సిబిఐ విచారించిన విషయం తెలిసిందే. వారిని విచారించిన అనంతరం సిబిఐ ఇప్పుడు మరో సప్లిమెంటరీ ఛార్జీషీట్ దాఖలు చేయడానికి సిద్ధమవడం గమనార్హం.
రేపు ఛార్జీషీట్ దాఖలు చేస్తాం
జగన్ ఆస్తుల కేసులో మొదటి ఛార్జీషీటుకు అనుబంధ ఛార్జీషీటును రేపు(మంగళవారం) దాఖలు చేస్తామని సిబిఐ కోర్టుకు ఈ రోజు(సోమవారం) తెలియజేసింది. మొదట ఇవ్వాలే ఛార్జీషీటు దాఖలు చేస్తారని వార్తలు వచ్చినా సిబిఐ రేపు దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపింది. జగన్ ఆస్తుల కేసు విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాద రావు ఈ రోజు కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు, జగన్ ఆస్తులు, ఓఎంసి, ఎమ్మార్ కేసుల నిందితుల రిమాండును కోర్టు పొడిగించింది.