ముఖ్యమంత్రి ఇష్టం: షబ్బీర్, సిఎంని అడుగుతా: జానా
తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి, శాసనమండలి సభ్యుడు షబ్బీర్ అలీలు కూడా విద్యుత్ ధరల పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేసారు. విద్యుత్ పెంపు విషయంలో ప్రజలకు ఊరట కల్గించేలా ప్రభుత్వం వ్యవహరించాలని జానా రెడ్డి సూచించారు. సమావేశంలో తాను విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి ముందు లేవనెత్తుతానని ఆయన చెప్పారు.
విద్యుత్ పెంపు విషయంలో పేదలపై భారం పడకుండా చూడమని తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరుతానని షబ్బీర్ అలీ అన్నారు. ఎమ్మెల్సీగా ఆయన ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2004లో విద్యుత్ పైన ప్రజలకు ఇచ్చిన హామీతోనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని అన్నారు.
పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమన్నారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందన్నారు. పెద్దమనుషుల ఒప్పందం, సిక్స్ పాయింట్ ఫార్ములా ప్రకారం మైనార్టీలను కేబినెట్లోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.