హరీష్ రావు కాలు పెడితే చాలు, కింగ్ మేకర్లం: కెసిఆర్
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు ఎక్కడ అడుగుపెడితే అక్కడ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. వచ్చే ఎన్నికల అనంతరం తెరాస కింగ్ మేకర్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. అత్యధిక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను తామే గెల్చుకుంటామన్నారు.
హైదరాబాద్ నుండి ఎవరు కూడా పరిశ్రమలను తరలించవద్దని ఆయన కోరారు. తామే కింగ్ మేకర్లం అవుతామని, అప్పుడు ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ వచ్చి తెలంగాణ ఇచ్చి వెళ్తారన్నారు. తెలంగాణ వచ్చాక రైతులకు, పరిశ్రమలకు విద్యుత్ కొరత రానివ్వమన్నారు. ఎనిమిది గంటల విద్యుత్ ఇస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అహంబావి అని ధ్వజమెత్తారు.
బరితెగించి మాట్లాడే ముఖ్యమంత్రి ఉండటం మన దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విద్యుత్ పేరిట పోటీ పడి దీక్షలు చేస్తున్నాయని, ఆ పార్టీలకు తమ పవర్ తప్ప రైతులకు పవర్ ఇవ్వాలనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. విద్యుత్ సంక్షోభానికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పాలనలే కారణమని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక సమస్యలు తీర్చుతామని, ఢిల్లీ పెద్దలు సలాం కొట్టి తెలంగాణ ఇచ్చిపోతారన్నారు.
వచ్చే ఎన్నికల్లో హైదరాబాదులో గులాబీ జెండా ఎగురాల్సిందే అన్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో గెలిస్తే తెరాసనే కింగ్ మేకర్ అవుతుందన్నారు. తెలంగాణ వచ్చాక రైతాంగాన్ని కాపాడుకుంటామని చెప్పారు. తాము ఉద్యమ పంథాను కొనసాగిస్తూనే రాజకీయంగా ముందుకు వెళ్తామన్నారు. కిరణ్ ఎండిన పంటలు, రైతుల కష్టాల ఫోటోలు చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీలు విద్యుత్ సమస్యపై నాటకాలు కట్టిపెట్టాలన్నారు.