పిక్చర్స్: జగన్ రాకపోతే విజయమ్మ లాక్కొస్తారా?
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం వైయస్ విజయమ్మది చీకూ చింత లేని జీవితమే అనుకోవాలి. రాజకీయాలు ఆమెకు చాలా దూరం. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించడంతో రాజకీయాలు భారీ కుదుపునకు గురయ్యారు. కుమారుడు వైయస్ జగన్ నాయకత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కాంగ్రెసు పార్టీలో అసమ్మతి రాగం పాడుతూ శానససభ్యులను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. ఓదార్పు యాత్ర పేరిట రాష్ట్ర పర్యటన చేపట్టారు.
ఓదార్పు యాత్రకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం కళ్లెం వేయడానికి ప్రయత్నించినా ఆయన వెనక్కి తగ్గలేదు. కాంగ్రెసుకు రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. రాష్ట్ర పర్యటన చేస్తున్న సమయంలోనే ఆయనను విచారణకు పిలిపించి సిబిఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి విజయమ్మ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బరువుబాధ్యతలను భుజాన వేసుకున్నారు. భర్త మరణించిన వేదన, కుమారుడు జైలు పాలైన బాధ, పార్టీని నడిపించాల్సిన బాధ్యత - ఇలా బరువు మీద బరువును మోస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు.
ఎప్పటికప్పుడు వైయస్ జగన్ జైలు నుంచి బయటకు వస్తాడని ఆమె ఆశిస్తూ ముందుకు నడుస్తున్నారు. పార్టీని నిలబెట్టడానికి, ప్రజలతో మమేకం కావడానికి ఆమె దీక్షలు చేపడుతున్నారు. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో నాయకుల మధ్య జిల్లాల్లో కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసం నాయకుల మధ్య పోటీ పెరిగి అసంతృప్తులు, అసమ్మతులు పెరిగిపోయాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలిగా పరిమితమైన పాత్రను పోషిస్తూ వచ్చిన విజయ్మ పార్టీ అధ్యక్షుడు, తన కుమారుడు వైయస్ జగన్ అరెస్టు కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇలా రోడ్డు మీదికి వచ్చారు.
వైయస్ జగన్ అరెస్టు తర్వాత వైయస్ విజయమ్మ తన కూతురు షర్మిలతో కలిసి ఉప ఎన్నికల్లో ప్రచారం సాగించారు. ఉప ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించింది. ఆ రకంగా పార్టీకి ఓ ఊపు వచ్చింది. పార్టీకి విజయమ్మ మాత్రమే దిక్కు అనుకున్న తరుణంలో షర్మిల రూపంలో మరో నాయకురాలు దొరికారు.
జగన్ ఓదార్పు యాత్ర చేపట్టినప్పటి నుంచి వైయస్ విజయమ్మది ఢిల్లీకి ఎక్కే గడప దిగే గడప లాగా తయారైంది. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవడానికి వెళ్లినప్పటి నుంచి జగన్ను విడుదల చేయాలని కోరుతూ చేపట్టిన సంతకాల సేకరణతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రం సమర్పించేవరకు ఆమె ఢిల్లీకి వెళ్లి వస్తూనే ఉన్నారు.
ఫీజు రీయంబర్స్మెంట్, కరెంట్ సమస్యలు - ఇలా ప్రతి సమస్యపై ఆమె దీక్షలు చేయడమో, ధర్నాలు చేయడమో సాగిస్తున్నారు. ఎన్నికలు వచ్చే వరకు ఇలాంటి దీక్షలు ఎన్ని చేయాల్సి ఉంటుందో...
పులివెందులలో పోటీ చేసినప్పుడు ఓట్లు అడుగుతూ ఇలా విజయమ్మ.. తన కోసం మాత్రమే కాకుండా తన పార్టీ అభ్యర్థులందరికీ ఓటు వేయాలని ఆమె గడప గడపకు కాకపోతే జిల్లా జిల్లాకు తిరగాల్సి రావచ్చు.
జైలులో ఉన్న కుమారుడు జగన్ను కలవడానికి ఇలా చంచల్గుడా జైలులు వెళ్లిరావడం ఆమె కార్యక్రమాల్లో భాగంగా మారింది. పార్టీని నడిపించే తీరుపై జగన్ ఆలోచనలను, నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ ములాఖత్లు ఉపయోగపడుతున్నాయి.
వరద తాకిడి ప్రాంతాల ప్రజలను పరామర్శిస్తూ విజయమ్మ ఇలా.... ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే విషయంలో ఇతర పార్టీల నాయకులతో పోటీ పడడం కూడా ఒక భాగంగా మారింది.
కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి వచ్చే శాసనసభ్యులను పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించడం కూడా విజయమ్మ చేతుల మీదుగానే జరుగుతూ వస్తోంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభా పక్ష నేతగా శాసనసభలో వైయస్ రాజశేఖర రెడ్డిపై, ఆయన ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే క్రమంలో ఇలాగా మండిపోతూ కూడా ఆమె కనిపిస్తున్నారు.
జగన్ జైలు నుంచి వస్తే తప్ప విజయమ్మకు ఊరట లభించే పరిస్థితి లేదు. పార్టీ వ్యవహారాల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా అది ఆమెకు గొప్ప ఊరటనిస్తుంది. ఈ విషయంలో ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేని స్థితి. విజయమ్మ మాత్రం దేవుడిపై భారం వేసినట్లు కనిపిస్తున్నారు.
వైయస్ జగన్ జైలు నుంచి బయటకు రాకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఆమె నాయకత్వం వహించాల్సి వస్తుంది. ఎన్నికల ప్రచారంలో తిరగాల్సి వస్తుంది. ఉప ఎన్నికల్లో ఆమె కాలికి బలపం కట్టుకుని ప్రచారం సాగించారు. అయితే, సాధారణ ఎన్నికల్లో ప్రచారం ఉప ఎన్నికల్లో ప్రచారం పరిమితులకు లోబడి ఉండదు. నిరంతరం పర్యటన చేస్తూ ఓటర్లను తన వైపు తిప్పుకునేందుకు శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో పార్టీని అధికారం దిశగా ఆమె నడిపించగలరా అనే చర్చ ప్రస్తుతం సాగుతోంది. కాలం మాత్రమే దానికి సమాధానం చెప్పగలుగుతుంది.