కిరణ్కు టిడిపి అల్టిమేటం: సిఎంతో ఎమ్మెల్యేల వాగ్వాదం
మంత్రివర్గంలోని కళంకిత మంత్రులను ఇరవై నాలుగు గంటల్లోగా తొలగించాలని వారు అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తాము ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను ముఖ్యమంత్రి వెనుకేసుకు రావడం శోచనీయమన్నారు.
జగన్ ఆస్తుల కేసులో పలువురు మంత్రులపై సిబిఐ ఇప్పటికే ఛార్జీషీటు వేసిందని, తాజాగా హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పైన వేసిందని వారిని వెంటనే తొలగించాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని వెనుకేసుకు రావడమేమిటని ప్రశ్నించారు. నిర్బయ చట్టంపై రాష్ట్రపతి సంతకం ఆరకముందే తెనాలిలో పలువురు వ్యక్తులు మహిళను లారీ కిందకు తోసేసి హత్య చేయడం దారుణం అన్నారు.
తెనాలి ఘటనపై బాబు ఫైర్
గుంటూరు జిల్లా తెనాలి ఘటనలో మహిళను చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా పాదయాత్రలో డిమాండ్ చేశారు. బాధితులకు రూ.10 లక్షళ ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెనాలి ఘటనను చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుస్తోందన్నారు.
సిఎం పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యేలు
అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్న సభలో కలకలం చెలరేగింది. విద్యుత్ ఛార్జీలు, సబ్ ప్లాన్ పైన ప్రతిపక్షాల పైన కిరణ్ మండిపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి సభలోనే వేదిక పైనున్న బెల్లంపల్లి సిపిఐ ఎమ్మెల్యే గుండా మల్లేష్, చెన్నూరు తెరాస ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తమ నిరసన తెలిపారు. తమను పిలిచి అవమానిస్తున్నారంటూ వారు సిఎంతో వాగ్వాదానికి దిగారు. కిరణ్, ఇతర మంత్రులు వారిని సముదాయించారు.