బ్యాంక్ లో భారీ కోత
యాక్సిస్ బ్యాంక్ బిగ్ షాక్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. వారి సంఖ్యను తగ్గించుకుంది. తన బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఇతర ఫైనాన్షియల్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా భారీగా విస్తరించినప్పటికీ లేఆఫ్స్ కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదనపు బ్రాంచ్ లను ఏర్పాటు చేయడం ద్వారా భారీగా ఉద్యోగాల నియామకాలు చేపట్టొచ్చనే ఆశలపై నీళ్లు చల్లింది.
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఆక్సిస్ బ్యాంక్ మొత్తం ఉద్యోగులు 1.01 లక్షలకు చేరారు. అంతకుముందు సంవత్సరంలోఈ సంఖ్య 1.04 లక్షలుగా ఉండేది. ఈ ఉద్యోగుల కోత అనేది విస్తృత స్థాయిలో చోటు చేసుకుందని, ఏ ఒక్క నిర్దుష్ట విభాగానికి కూడా సంబంధించినది కాదని బ్యాంక్ మేనేజ్మెంట్ తెలిపింది. ఇక ముందు కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే అవకాశాలను కొట్టిపారేయట్లేదు.

పోస్ట్ ఎర్నింగ్స్ కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ చౌదరి ఈ విషయాలను వెల్లడించారు. అదనపు బ్రాంచీలను ఏర్పాటు చేసినప్పటికీ కూడా డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ పై దృష్టి సారించామని, దీనివల్లే ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో అదనపు పెట్టుబడులు పెడుతున్నట్లు అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. తమ కార్యాచరణ ప్రణాళికలన్నీ కూడా బ్యాంక్ ప్రొడక్టివిటీని మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగుల సంఖ్యను ఆప్టిమైజ్ చేయడం దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగమని అమితాబ్ చౌదరి ఉద్ఘాటించారు. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా నిర్వహణ వ్యయంలో 9-10 శాతాన్ని టెక్నాలజీ అప్ గ్రేడ్ కు కేటాయించినట్లు తెలిపారు. బిజినెస్ సైకిల్ తో సంబంధం లేకుండానే ఈ పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 400 బ్రాంచ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మార్చి త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ పనితీరు దాదాపు ఫ్లాట్ గా నమోదైంది. నికర లాభం 7,071 కోట్ల రూపాయలు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7,117 కోట్ల రూపాయలతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేర్ కు ఒక రూపాయి డివిడెండ్ను కూడా యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ కు అందజేసిన ఫైలింగ్ లో ఈ విషయాన్ని పొందుపరిచింది.












Click it and Unblock the Notifications