చంద్రబాబుకు కాళ్ల నొప్పులు, చీలమండ వాపు
చీలమండ దగ్గర వాపు వల్ల రక్తప్రసరణ సమస్య తలెత్తుతోందని డాక్టర్లు తెలిపారు. పాదయాత్రను నిలిపివేయాలని వైద్యులు సూచించిన ప్పటికీ బాబు పాదయాత్ర కొనసాగించడానికే మొగ్గుచూపుతుండటంతో రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని కోరారు. దీంతో చంద్రబాబు పాదయాత్రకు రెండు రోజుల విరామం ప్రకటించారు.
చంద్రబాబు నడకను కొనసాగిస్తే తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. రోజుకు ఆరేడు కిలోమీటర్లకు మించి నడవకూడదని ఆయన అన్నారు. శుక్రవారం నడక సాగించడం వల్ల నొప్పి మరింత తీవ్రమైందని అంటున్నారు. పాదయాత్ర సాగించడం కష్టమని, ఆపేయాలని తాము సలహా ఇస్తున్నామని శ్రీనివాస్ అన్నారు.
పాదయాత్రను ఆపేయాలని తాము కోరుతున్నామని, అయితే చంద్రబాబు వినడం లేదని, పాదయాత్రను కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు గరికపాటి మోహన రావు, అయన్నపాత్రుడు చెప్పారు. సోమవారం సాయంత్రం తిరిగి చంద్రబాబు యాత్ర ప్రారంభిస్తారని వారు చెప్పారు. ఈ నెల 27వ తేదీన విశాఖపట్నంలో ముగింపు సభ ఉంటుందని వారు చెప్పారు. చంద్రబాబు రిస్క్ తీసుకుంటున్నారని వారన్నారు.