పోల్: సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీ రామారావు అసలైన వారసడంటూ 10,689 మంది అంటే 53.1 శాతం మంది అభిప్రాయపడ్డారు. బాలయ్యకు అనుకూలంగా 5,022 ఓట్లు అంటే 25 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడి స్థానం ఉంది. చంద్రబాబుకు 12.4 శాతం, నందమూరి హరికృష్ణకు 3.5 శాతం, దగ్గుబాటి పురంధేశ్వరికి 4.7 శాతం, నారా లోకేష్కు1.3 శాతం ఓట్లు వచ్చాయి. దీన్ని బట్టి అత్యధికులు జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తున్నారని అనుకోవచ్చు.
కాగా, ఎన్టీఆర్ బొమ్మలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల పాదయాత్రలో వాడుకోవడాన్ని అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. షర్మిల పాదయాత్రలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టడం సరైందేనా అడిగితే కాదని 60.6 శాతం మంది అభిప్రాయపడ్డారు. సమంజసమేనని 36.5 శాతం అభిప్రాయపడ్డారు. ఎటూ తేల్చనివాళ్లు 2.9 శాతం మంది ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని కోరుకునేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పాల్సి ఉంటుంది.
ఇదిలావుంటే, వన్ ఇండియా తెలుగు నిర్వహించిన ఆన్లైన్ పోల్కు కొన్ని పరిమితులున్నాయని గుర్తించాల్సి ఉంటుంది. చదువుకున్న పట్టణ వర్గాలకు మాత్రమే ఇది పరిమితమవుతుంది. గ్రామీణ ప్రాంతాల అభిప్రాయాన్ని ఈ పోల్ వ్యక్తం చేయలేదు. వన్ ఇండియా తెలుగుకు ఉన్న విశేషమైన పాఠకలోకాన్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం చదువుకున్న మధ్యతరగతి ప్రజల అభిప్రాయం సరిగ్గానే వ్యక్తమైనట్లు భావించవచ్చు.