పోటీపై మీడియాకు ఎందుకు ఆందోళన: విజయశాంతి
శుక్రవారం మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షు కె. చంద్రశేఖర రావు పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
విజయశాంతి మీడియా ప్రతినిధుల ప్రశ్నకు స్పందించారు. ఈ అంశంపై పార్టీ అధినేత కెసిఆర్, తాను మాట్లాడుకుంటామని, తమకు లేని ఆందోళన మీడియాకెందుకని అన్నారు. తానూ విజయశాంతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని, గెలిచి తీరుతామని కెసిఆర్ శుక్రవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
మెదక్ సీటు నుంచి కెసిఆర్ పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో విజయశాంతి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, దీంతో ఆమె అసంతృప్తితో ఉన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు విజయశాంతి నుంచి దానికి సమాధానం రాబట్టుకోవడానికి ప్రయత్నించారు.