ఏం చేద్దాం: బొత్స, కిరణ్ రెడ్డిలతో రాహుల్ గాంధీ

తెలంగాణ, వైయస్ జగన్ అంశాల నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు జరగకపోవడం, పార్టీ నుంచి వలసలను నిరోధించలేకపోవడం వంటి వాటిపై రాహుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సిఎం కిరణ్, మరికొందరు నేతలు తనను కలసినప్పుడు రాష్ట్ర వ్యవహారాలపై సోనియా గాంధీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్, ఒక రూపాయికి కిలో బియ్యం, అమ్మ హస్తం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి చురుకుగా వెళ్లడంపై సోనియాతో పాటు రాహుల్ గాంధీ ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాత్రం ఆమె ఏమంత సంతోషంగా లేరని పార్టీ నేతలు వివరిస్తున్నారు. తెలంగాణ అంశంపై త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలన్న వాదనతో ఏకీభవిస్తూనే, ఇప్పటికీ వలసలు ఎందుకు తగ్గడం లేదని నిలదీసినట్లుగా వార్తలు వచ్చాయి.
మే 10వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత సమూల ప్రక్షాళనా కార్యక్రమం చేపట్టాలని సోనియా గాంధీ భావిస్తున్నారు. అప్పటికి కర్ణాటక ఎన్నికలు ముగిసిపోతాయని, దాంతో రాష్ట్ర వ్యవహారాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు సమయం లభిస్తుందని అంటున్నారు.
మే మూడో వారం తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేస్తున్నందున ఆలోగా రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను సంస్థాగతంగా మార్పులూ చేర్పులూ చేయాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications