అప్పుడే చెప్పా: జూనియర్ ఎన్టీఆర్పై బాలకృష్ణ
తాను అనవసరమైన విషయాల గురించి మాట్లాడబోనని, వ్యక్తులు గురించి కూడా మాట్లాడబోనని ఆయన చెప్పారు. దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో బాలకృష్ణ వైఖరి మారలేదని అర్థమవుతోంది. హైదరాబాదులోని దిల్షుక్నగర్ బాంబు పేలుళ్ల బాధితులను బాలకృష్ణ శనివారంనాడు పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని ఆయన పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
బాధితుల కుటుంబ సభ్యులకు ఆయన ఆర్థిక సహాయంగా ఆటోలను అందించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పుట్టిన రోజు సందర్భంగా అంధ విద్యార్థుల పాఠశాలలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.
మహిళలపై దాడులను అరికట్టడంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బాలకృష్ణ ఆరోపించారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలోనే అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలను కాపాడుకోవడంలో తప్ప శాంతిభద్రతల విషయంలో శ్రద్ధ చూపడం లేదని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచారాలు జరగడం దారుణమని ఆయన అన్నారు.