బాబుకు తలనొప్పి: కడియం వర్సెస్ మోత్కుపల్లి
తాజాగా కడియం శ్రీహరి వ్యవహారం తెలుగుదేశం తెలంగాణ నేతల్లో చిచ్చు పెడుతోంది. కడియం శ్రీహరిపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే వ్యవహారం ముదిరినట్లే కనిపిస్తోంది. కడియం శ్రీహరి పార్టీలో ఉంటారా, లేదా అనేది కూడా సందేహంగానే మారింది. వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరితో అదే జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు పొసగదు. ఇప్పుడు దళితవర్గానికి చెందిన మోత్కుపల్లి నర్సింహులు కూడా ఆయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణపై చంద్రబాబు ముందడుగు వేసినట్లు కనిపిస్తున్నా, అప్పటికప్పుడు కాస్తా ఊరట కలుగుతున్నప్పటికీ పార్టీ నుంచి వెళ్లిపోయే నాయకుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. నిజానికి, చంద్రబాబు చుట్టూ ఉన్న నాయకుల వల్లనే వారు వెళ్లిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో మోత్కుపల్లి నర్సింహులుతో సుదీర్ఘ కాలం పోరాటం చేసి సంకినేని వెంకటేశ్వర రావు తెలుగుదేశం పార్టీని వీడి, వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
నిజానికి, వ్యవహారం నాగం జనార్దన్ రెడ్డితోనే రెండో విడత ప్రారంభమైంది. మొదటి విడత ప్రస్తు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్తో ప్రారంభమైంది. నాగం జనార్దన్ రెడ్డితో పాటు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, తదితరులు పార్టీని వీడారు. తెలంగాణపై దూకుడు వ్యవహరిస్తున్న నాగం జనార్దన్ రెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రావును చంద్రబాబే పోటీకి దించారని అంటున్నారు. ఎర్రబెల్లి వ్యవహారంతో పార్టీలో ఇమడలేక నాగం జనార్దన్ రెడ్డి, మరికొంత మందిని వెంట పెట్టుకుని బయటకు వచ్చేశారు.
పార్టీలో మోత్కుపల్లి నర్సింహులుకు చంద్రబాబు ఇతోధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇది కొంత మంది నాయకులకు నచ్చడం లేదని చెబుతున్నారు. నిజానికి, మోత్కుపల్లి నర్సింహులుకు సొంత ప్రాంతానికి చెందిన నల్లగొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొందుగల నర్సింహారెడ్డితో ఎన్నడూ పడేది కాదు. మోత్కుపల్లితో నెలకొన్న విభేదాలతో ఆయన పార్టీలు మారుతూ వచ్చారు.
నల్లగొండ జిల్లాలో తొలుత మోత్కుపల్లికి మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డితో పడేది కాదు. అయితే, మాధవరెడ్డి తన పలుకుపడితో, నాయకత్వ పటిమతో మోత్కుపల్లిని ఎదుర్కుంటూ వచ్చారు. ఆ తర్వాత మాధవ రెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డితో మోత్కుపల్లి కయ్యానికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు ఉమా మాధవరెడ్డి పార్టీలో చురుగ్గా వ్యవహరించడం లేదని అంటున్నారు. తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసిన కొత్తలో ఎర్రబెల్లి దయాకర్ రావుతోనూ మోత్కుపల్లి కయ్యానికి కాలు దువ్వారు.
తెలంగాణపై చర్చించడానికి ఏర్పాటు చేసిన పోలిట్బ్యూరో సమావేశానికి తనను ఆహ్వానించలేదని మోత్కుపల్లి ఆ మధ్య చంద్రబాబుపై అలిగారు. ఎట్టకేలకు చంద్రబాబు మోత్కుపల్లిని బుజ్జగించారు. తాను పాదయాత్రలో ఉన్న సమయంలో శానససభా సమావేశాల సందర్భంగా మోత్కుపల్లికి చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లికి ప్రాధాన్యం పెరగడం కొంత మంది సీనియర్ నేతలకు గిట్టడం లేదని అంటున్నారు. ఏమైనా, తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు సమస్యలను ఎదుర్కుంటూనే ఉంది.