చీడపురుగులున్నారు: కడియంపై మోత్కుపల్లి ఫైర్
పార్టీ సమావేశం వివరాలను బయటకు వెల్లడించాల్సిన అవసరం ఎవరికి ఉందో, వారి గురించి అందరికీ తెలుసునని, అటువంటివారు పార్టీ నుంచి వెళ్లిపోతే మంచిదని, వారు వెళ్లిపోయినా పార్టీకి ఏ విధమైన నష్టం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమావేశం అంతర్గత విషయాలను బయటకు చెప్పడం దిగజారుడుతనమని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీకి కడియం శ్రీహరి సేవలు అందించారని, తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడని ఆయన అన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లుగానే తమ పార్టీలోనూ చీడపురుగులున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటూనే పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారు తమ పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. వ్యక్తిగత సమస్యలను పార్టీకి రుద్దడం సరి కాదని ఆయన అన్నారు.
పార్టీలో అనేక సమస్యలుంటాయని, వాటిని బహిర్గతం చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్ర తర్వాత తెలంగాణలో పార్టీ పుంజుకుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. చంద్రబాబు చెవులు కొరికేవారి మాటలే వింటున్నారని, పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయి తిరిగి వచ్చినవారికి పెద్ద పీట వేస్తున్నారని కడియం శ్రీహరి శుక్రవారంనాటి తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశంలో అన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.