ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై రేప్: నిందితుడి అరెస్టు
బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత మనోజ్ కుమార్ రైలు ఎక్కి ఢిల్లీ నుంచి బీహార్కు పారిపోయాడు. మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ముజఫర్పూర్లో అరెస్టు చేసిన తర్వాత మనోజ్ కుమార్ను పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి కోర్టు ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిందితుడిని శనివారం ఉదయం ఢిల్లీకి తరలించారు. మనోజ్ కుమార్కు ఇటీవలే వివాహం జరిగింది. భార్య రెండు రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లింది.
అత్యాచారానికి గురైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 24 గంటలు దాటితే గానీ పాప పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. బాలికను ఏప్రిల్ 15వ తేదీన అపహరించి, ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా దుండగుడు ఫ్లాట్లో బందీగా ఉంచి కిరాతకచర్యకు పాల్పడ్డాడు. 30 ఏళ్ల వయస్సు గల ఆ దుర్మార్గుడు తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్లో బాలిక కుటుంబం ఉంటున్న అపార్టుమెంటులోనే ఉంటున్నాడు.
బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఆమెను రక్షించారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వెలుపల నిరసన ప్రదర్శనకు దిగారు. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్కు, ఢిల్లీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు కేసును మాయ చేయాలనే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. తమ కూతురు అదృశ్యంపై ఫిర్యాదు చేస్తే కూడా పోలీసులు తీసుకోలేదని బాలిక తండ్రి చెప్పాడు.