ఢిల్లీ రేప్: ఆందోళనలతో అట్టుడుకుతున్న రాజధాని
ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ పోలీసు కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనకు దిగారు. పోలీసు కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ఓ ఆందోళనకారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ నివాసాల వద్ద భద్రతను పెంచారు.
ఎయిమ్స్ వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. బాలికను మరో ఆస్పత్రి నుంచి శుక్రవారం రాత్రి ఎయిమ్స్కు తరలించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కేసును నీరు గార్చడానికి ప్రయత్నించారనే ఆరోపణపై గాంధీనగర్ పోలీసులపై ఆందోళనకారులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరసన తెలియజేస్తున్న అమ్మాయిపై చేయి చేసుకున్న ఎస్ఐని సస్పెండ్ చేస్తే సరిపోదని ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
బాధాకరమన్న రాష్ట్రపతి
దేశ రాజధానిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి సత్వర న్యాయం అందించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
సుష్మా దిగ్భ్రాంతి
ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరగడం పట్ల బిజెపి నేత సుష్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలను నిరోధించేందుకు పటిష్టమైన చట్టాలు అవసరమని ఆమె అన్నారు. చిన్నారులపై అత్యాచారాలు జరిపేవారికి ఉరిశిక్ష విధించాలని ఆమె అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అమానుషమన్న సోనియా..
ఢిల్లీలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరగడం అమానుషమని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. మాటలు కాదు, చర్యలు అవసరమని సోనియా అన్నారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని సిపిఎం పోలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. దేశ రాజధానిలో ఐదేళ్ల బాలికపై అత్యాచారం జరగడం అమానుషమని ఆమె అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు.
బాలిక కుటుంబ సభ్యులకు ఆజాద్ పరామర్శ
అత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యులను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ పరామర్శించారు. బాలికకు అవసరమైన వైద్య సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.