నీదేం పార్టీ 'బాబు'?: కెసిఆర్, రాధాకృష్ణపై నిప్పులు

బయ్యారం ఉక్కును విశాఖ పరిశ్రమకు తరలించవద్దని, ఖమ్మం జిల్లాలోనే పరిశ్రమను ఏర్పాటు చేయాలని తాము కోటి సంతకాలు సేకరించి కేంద్రానికి పంపిస్తామన్నారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలతో పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారన్నారు. రక్షణ స్టీల్స్కు బయ్యారం గనులు కేటాయించినప్పుడు మొదట ఉద్యమించింది తెరాసేనని, అలా అని నిరూపిస్తే అబిడ్స్లో ముక్కు నేలకు రాస్తావా అని సవాల్ విసిరారు.
టిడిపి కూలిపోతోందని, ఆయన పార్టీపై ఎవరికీ ఆశలు లేవని, అలాంటి చంద్రబాబు తెరాసను ఫాం హౌస్ పార్టీ అనడమేమిటన్నారు. అక్కడ తాను వ్యవసాయం చేస్తున్నానని, అక్కడున్నది ఫాం హౌస్ కాదని, ఫాం మాత్రమే అన్నారు. ఉద్యమంపై అక్కసుతోనే రాధాకృష్ణ, చంద్రబాబులు ఫాం హౌస్ అంటున్నారన్నారు. తమది సూటుకేసుల పార్టీ అని చంద్రబాబు అంటున్నారని, అసలు సూటుకేసుల పార్టీ ఆయనదే అన్నారు.
బయ్యారంలో పరిశ్రమ కోసం తెలంగాణ మంత్రులు ఒత్తిడి తేవాలని లేదంటే బయటకు రావాలన్నారు. తమది ఫాం హౌస్ పార్టీ అని చంద్రబాబు అంటే ఆయనది పిల్లి గడ్డం బుల్లి పార్టీయా? లేక హెరిటేజ్ పార్టీయా? అని ఎద్దేవా చేశారు. పాలు, కూరగాయలు అమ్ముకుంటున్న నీది హెరిటేజ్ పార్టీగా పిలువవచ్చా అన్నారు. బయ్యారం గనులపై చంద్రబాబు సొల్లు పురాణం చెబుతున్నారన్నారు.
రాధాకృష్ణపై నిప్పులు
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కెసిఆర్ నిప్పులు చెరిగారు. రాధాకృష్ణ ఏం చేసినా టిడిపిని కాపాడలేరని, రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చే ఆస్కారం ఏమాత్రం లేదన్నారు. ఆయన తన రాతలతో టిడిపిని కాపాడాలనుకుంటున్నారని విమర్శించారు. తెరాస బలపడుతుంటే రాధాకృష్ణ, బాబులు భయపడుతున్నారన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అప్పుడు అన్నప్పుడు ఇప్పుడు బయ్యారం హక్కు తెలంగాణ వారిది అనడంలో తప్పేముందన్నారు.
రాష్ట్రీయ భావాలు లేని వాళ్లు జాతీయ భావాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. విశాఖలో ఫ్యాక్టరీ జాతికి చెందిందంటున్న రాధాకృష్ణ అక్కడి ఫ్యాక్టరీలో ఎంతమంది తెలంగాణవాళ్లు ఉన్నారో చెప్పాలన్నారు. రాధాకృష్ణ ఆత్మవంచన చేసుకుంటున్నారన్నారన్నారు. ఖమ్మంలో ఫ్యాక్టరీ పెట్టాలనుకునే వారికి పిచ్చి ముదిరిందని ఆయన రాతలు రాస్తున్నారని, అశలు పిచ్చి ఎవరికి ముదిరిందో చెప్పాలన్నారు.
తమ పార్టీ వ్యవహారాలపై రాధాకృష్ణ తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. టిడిపిని గట్టెక్కించేందుకు రాధాకృష్ణ చేసే ప్రయత్నాలు ఏమాత్రం ఫలించవన్నారు. రాధాకృష్ణ కథ చాలా ఉందని, ఇది ప్రారంభమేనని ముగింపు కాదన్నారు. కరీంనగర్ నుండి గంగుల కమలాకర్ పార్టీలో చేరగానే నారదాసు అలకవహించారని, బుజ్జగింపులను రాశారని మండిపడ్డారు. రాధాకృష్ణ పిచ్చి రాతలు ఆపకపోతే తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.
తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న ముఖ్యమంత్రికి ఒక్క ఓటు తెలంగాణలో పడదని, తెలంగాణకు అడ్డుపడ్డ టిడిపికి ఒక్క సీటు కూడా రాదని కెసిఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు, టిడిపి పార్టీలను నామరూపాలు లేకుండా చేస్తామన్నారు. ఇతర పార్టీలు బలపడాలనుకున్నట్లే తాము బలపడాలనుకోవడంలో తప్పేముందన్నారు. తెరాసలో కలకలం సృష్టించేందుకు అవాస్తవాలు రాస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications