ఢిల్లీలో చిన్నారి రేప్: కోలుకుంటుందన్న వైద్యులు

సోనియా ఇంటి ముట్టడి యత్నం
అత్యాచార ఘటనపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికపై అత్యాచారాన్ని నిరసిస్తూ బిజెపి మహిళా నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటిని ముట్టడించారు. వారు సోనియాకు, కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఐదేళ్ల బాలికపై దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారానికి పాల్పడి, ఆమెపై కిరాకతకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని బీహార్లోని ముజఫర్పూర్లో శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు బీహార్ పోలీసుల సహకారంతో మనోజ్కుమార్ అనే నిందితుడ్ని పట్టుకున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత మనోజ్ కుమార్ రైలు ఎక్కి ఢిల్లీ నుంచి బీహార్కు పారిపోయాడు.
మొబైల్ ఫోన్ లోకేషన్ ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ముజఫర్పూర్లో అరెస్టు చేసిన తర్వాత మనోజ్ కుమార్ను పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి కోర్టు ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ విధించింది. నిందితుడిని శనివారం ఉదయం ఢిల్లీకి తరలించారు. మనోజ్ కుమార్కు ఇటీవలే వివాహం జరిగింది. భార్య రెండు రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లింది.
బాలికను ఏప్రిల్ 15వ తేదీన అపహరించి, ఆహారం, మంచినీళ్లు ఇవ్వకుండా దుండగుడు ఫ్లాట్లో బందీగా ఉంచి కిరాతకచర్యకు పాల్పడ్డాడు. 30 ఏళ్ల వయస్సు గల ఆ దుర్మార్గుడు తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్లో బాలిక కుటుంబం ఉంటున్న అపార్టుమెంటులోనే ఉంటున్నాడు. బాలిక అరుపులు విన్న కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఆమెను రక్షించారు. కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగువారు, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రి వెలుపల నిరసన ప్రదర్శనకు దిగారు.












Click it and Unblock the Notifications