పాడు చేస్తున్నారు: కెసిఆర్పై దుమ్మెత్తిపోసిన కిరణ్
సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మండిపడ్డారు. బయ్యారం ఒప్పందాన్ని రద్దు చేయకపోతే మే నెలలో భూకంపం సృష్టిస్తామన్న కేసీఆర్ హెచ్చరికకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. "మే నెలలో భూకంపం సృష్టిస్తావా!? సృష్టించు చూస్తా. భూకంపాన్ని సృష్టించే సత్తా మీకుంటే దానిని ఎదుర్కొనే సత్తా నాకుంద''ని ఆయన అన్నారు.
ఇలాంటి మాటలకు, బెదిరింపులకు భయపడనని అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం మైదానంలో సోమవారం రాత్రి జరిగిన ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బయ్యారంలో 55 వేల హెక్టార్ల ఇనుప ఖనిజాన్ని గతంలో రక్షణ స్టీల్స్కు కట్టబెట్టారని, అయితే, నిబంధనలకు అనుగుణంగా లేదని ఆ ఒప్పందాన్ని రద్దు చేశామని, అందులో కేవలం ఐదు వేల హెక్టార్లను విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాష్ట్రీయ ఇస్పాత్ నిగంకు కేటాయించామని చెప్పారు.

మనం ఖనిజం ఇస్తే, రాష్ట్రీయ ఇస్పాత్ నిగం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేలా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నామని, ఈ పరిస్థితుల్లో బయ్యారం ఖనిజం కేటాయింపును రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేయడం న్యాయంగా ఉందా అని ఆయన అన్నారు. గతంలో ప్రైవేట్ వ్యక్తులకు 55 వేల హెక్టార్లలో బయ్యారం ఖనిజాన్ని కేటాయిస్తే బెల్లం కొట్టిన రాయిలా ఉన్న కేసీఆర్ దేశ సంపద అయిన ఖనిజాన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయిస్తే రద్దు చేయాలంటున్నారని, ఒప్పందాన్ని రద్దు చేయనని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
తెలంగాణకు మేలు చేసేలా తాను కృషి చేస్తుం టే దానికి అడ్డు పడేలా వ్యవహరించడం తగదని అన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. "మీ ఉద్యమాలతో విద్యార్థుల జీవితాలు పాడయ్యే పరిస్థితులు వచ్చాయి. చదువులు లేక ఉద్యోగాలు రాకుండా చేస్తే అందరికీ నష్టం. మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు. కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఏ పార్టీ వాళ్లు నిజంగా ఉద్యమం చేస్తున్నారో, ఏ పార్టీ వాళ్లు ఉద్యమం పేరిట వ్యాపారం చేస్తున్నారో ప్రజలకు తెలుసు'' అని ఆయన అన్నారు.
టీవీ, పేపర్ పెట్టుకుని తప్పుడు ప్రచారాలు రాష్ట్రీయ ఇస్పాత్ నిగంకు బయ్యారం ఖనిజాన్ని కేటాయిస్తే గిరిజనులకు అన్యాయం చేశానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పెద్దఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతుంటే ఒక టీవీ, ఒక పేపర్ పెట్టుకుని పింఛన్లు ఇవ్వడం లేదని, స్కాలర్షిప్లు రావడం లేదంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాని విమర్శించారు.












Click it and Unblock the Notifications