మమ్మల్నివెంటాడి కొట్టమంటా, భారతిది సరికాదు: డిఎల్
ఈ పథకాన్ని సరిగా అమలు చేయకుండే తరిమి కొట్టాలని తాను ప్రజలకు పిలుపునిస్తానని చెప్పారు. ఈ పథకంపై మంత్రివర్గంలో చర్చించలేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు పార్టీ సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి రెడ్డి సుప్రీం కోర్టు ప్రాంగణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)ను ప్రశ్నించడం సరికాదని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. బంగారు తల్లి పథకం తన శాఖకు సంబంధించినదని, ఇది మంచి పథకమే అన్నారు. అమలు చేయకుంటే మాత్రం వెంట పడి మమ్మల్ని కొట్టాలని చెబుతానన్నారు.
తెలియదన్న బొత్స
బంగారు తల్లి పథకం గురించి తనకు తెలియదని, తెలిస్తే మాట్లాడుతానని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వేరుగా అన్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ రానందుకే తాను మెదక్ జిల్లా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనకు రాలేదనడంలో వాస్తవం లేదన్నారు. పిసిసి చీఫ్గా విభేదాలు పరిష్కరిస్తానే తప్ప సృష్టించనన్నారు. 1999లో విభేదాల వల్లే ఓడిపోయామని, 2009లో లోపాల వల్ల సీట్లు తగ్గాయన్నారు.
మంత్రులను కిరణ్ సంప్రదించారు.. పితాని
పథకాలపై ముఖ్యమంత్రి మంత్రులను సంప్రదిస్తున్నారని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మాత్రమే అన్నారు. అధిష్టానం అనుమతితోనే విస్తరణ జరుగుతుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టేందుకు పిడి యాక్ట్ తెస్తామన్నారు. ఇందుకోసం క్యాంప్ ఏర్పాట్లతో పాటు ఆయుధాలు సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద పది లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయని, కేంద్రం అనుమతిస్తే సింగపూర్, మలేషియాలో విక్రయిస్తామన్నారు.