అమ్మ దయ!: కర్నాటక ఎన్నికలు తర్వాత ఢిల్లీకి కిరణ్
ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయడం, పథకాలపై చర్చించడం వంటి పలు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించాలని ఎప్పటి నుండో చూస్తున్నారని సమాచారం. ప్రధానంగా మంత్రివర్గ మార్పు కోసం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుమతి కోసం ఆయన చూస్తున్నారు.
ఇటీవల మంత్రివర్గంలో మార్పులు చేర్పుల కోసం అనుమతివ్వాలని సోనియా గాంధీని కలవాలని భావించారు. అయితే అప్పుడు కర్నాటక ఎన్నికల హడావుడిలో ఉన్న సోనియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు ఆసక్తి చూపించలేదు. కర్నాటక ఎన్నికలు పూర్తయ్యాక రావాలని కిరణ్కు సూచించింది.
దీంతో కన్నడనాట ఎన్నికలు పూర్తి కాగానే ఈ నెల ఆరున లేదా ఏడో తేదిన కిరణ్ ఢిల్లీ వెళ్లి అధినేత్రిని కలవాలని చూస్తున్నారు. మంత్రివర్గంలో తనకు అనుకూలురైన వారిని తీసుకుని, వ్యతిరేకులను పక్కన పెట్టాలని ఆయన భావిస్తున్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి నేతలను ఆయన డ్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి.