మంత్రుల రాజీనామాపై సోనియా వర్సెస్ మన్మోహన్
వరుస కుంభకోణాలతో యుపిఎ ప్రభుత్వం ప్రతిష్టకు విఘాతం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కుంభకోణాలపై మీడియాకు వివరణ ఇవ్వాలని ప్రధాని మన్మోహన్కు సోనియా సూచించారని తెలిసింది. అయితే, అవినీతి ఆరోపణలపై మీడియాతో మాట్లాడడానికి మన్మోహన్ సుముఖంగా లేరని సమాచారం. సోనియా సహా కాంగ్రెస్ నాయకులది ఒక దారి అయితే ప్రధానిది మరో దారి అయిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కోల్గేట్ వ్యవహారంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అశ్వనీకుమార్ తీరు కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. బొగ్గు స్కాం కేసులో సుప్రీంకు సమర్పించాల్సిన స్టేటస్ రిపోర్టును అశ్వనీకుమార్ చూడడమే కాకుండా దానిలో కొన్ని మార్పులు కూడా చేశారంటూ సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా సుప్రీంకోర్టుకు నివేదించడంతో న్యాయ శాఖ మంత్రి అశ్వినీ కుమార్ పరిస్థితి దారుణంగా మారింది. బు
అశ్వనీపై చర్యల విషయంలో సుప్రీం కోర్టులో విచారణ వరకు వేచి చూడాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం కనక అశ్వనీకుమార్ తీరును తప్పుబడితే కాంగ్రెస్కు కూడా ఆయన రాజీనామా కోరడం మినహా మరో మార్గం ఉండదు. కానీ, అశ్వనీకుమార్ ప్రధాని మన్మోహన్ సింగ్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అందుకే, అశ్వనీ రాజీనామా చేయాలని ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నా ప్రధాని ససేమిరా అంటున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అశ్వినీ కుమార్ రాజీనామాతో పాటు తన రాజీనామాను కూడా బిజెపి డిమాండ్ చేయడం కూడా మన్మోహన్ సింగ్ వైఖరికి కారణం కావచ్చునని అంటున్నారు. ఈ కుంభకోణం మొత్తం బొగ్గు శాఖ ప్రధాని చేతుల్లో ఉన్నప్పుడే జరిగిందని ఆరోపిస్తోంది. ఇప్పుడు, అశ్వనీకుమార్తో రాజీనామా చేయిస్తే.. అంతిమంగా అది మన్మోహన్ మెడకే చుట్టుకుంటుంది. అశ్వనీని ప్రధాని వెనకేసుకు రావడానికి ఈ కారణం కూడా ఉండి ఉండవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
రైల్వే బోర్డులో అత్యున్నత పదవి ఇప్పించేందుకు రూ.10 కోట్లతో బేరం కుదుర్చుకోవడమే కాకుండా రూ.90 లక్షలు తీసుకుంటూ ఆయన మేనల్లుడు విజయ్ సింగ్లా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. దీంతో, బన్సల్ రాజీనామాకు ఒత్తిడి తీవ్రమవుతోంది. ఇటు ప్రతిపక్షాలతోపాటు స్వపక్షంలోనూ ఆయన రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. తనకు సన్నిహితుడు కావడంతో ప్రధాని మన్మోహన్ ఆయనను వెనకేసుకు వస్తున్నారని అంటున్నారు
అయితే, ఇక్కడ మరో కోణమూ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రైల్వే బోర్డు స్కాంలో బన్సల్పై వేటు వేస్తే, కోల్గేట్లో అశ్వనీకుమార్ను కూడా తప్పించక తప్పదు. ఆ ఇద్దరిపైనా వేటు వేస్తే అది తనకు చుట్టుకుంటుందని మన్మోహన్ సింగ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, వారిపై వేటు వేయడానికి మన్మోహన్ వెనకాడుతున్నట్లు సమాచారం.