నరేంద్ర మోడీయే కాదు.. స్థానిక అభ్యర్థులూ కావాలి!
నిన్నటి సాధారణ ఎన్నికలలో కర్నాటకలో కాంగ్రెసు పార్టీ విజయం సాధించగా.. బిజెపి చావుదెబ్బ తిన్నది. ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఏ పార్టీ అయితే కర్నాటకలో అధికారంలోకి వస్తుందో... ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాదనే వాదన ఉంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సీట్లను సాధించకుండా కేంద్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చిన దాఖలాలు 1989 నుండి లేవనే చెప్పవచ్చు.
కర్నాటకలో కాంగ్రెసు గెలుపుకు కారణం బిజెపిని కర్నాటక జనతా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప చీల్చడమే. యడ్యూరప్ప పార్టీ 35 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. దీనిని బట్టే యడ్డీ బిజెపిని బాగా దెబ్బతీశారని చెప్పవచ్చు. చాలా స్థానాల్లో కెజెపి, బిజెపి ఓట్ల మధ్య తేడా తక్కువే ఉందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో యడ్యూరప్ప బిజెపిలోనే ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
కర్నాటకలో ఫలితాలపై బిజెపి ముందుగానే ఊహించిందని చెప్పవచ్చు. కర్నాటకలో బిజెపి ఓటమికి పాలనాపరమైన కారణాలు కూడా అనేకం ఉన్నాయని అంటున్నారు. కర్నాటక ఫలితాల నేపథ్యంలో బిజెపి తన వైఫల్యాలను చక్కదిద్దుకొని ఢిల్లీలో యూపిఏ2 ప్రభుత్వానికి సవాల్ చేయాల్సి ఉంది. బిజెపిలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు పాపులర్ నేత. గుజరాత్ ఎన్నికలలో నరేంద్ర మోడీ మూడోసారి ఎన్నికైన తర్వాత పలువురు బిజెపిని చూసి కాకుండా మోడీని చూసి ఓటేస్తానని చెప్పిన వారు ఉన్నారట.
నరేంద్ర మోడీకి ఉన్న పాపులారిటీ నేపథ్యంలో ఆయనను అంగీకరించాలనేది కేవలం బిజెపి సమస్య మాత్రమే అంటున్నారు. గత నెలలో నరేంద్ర మోడి కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందుకోసం బసవనగుడిలోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్సులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా ప్రజలు వచ్చారు. సభకు వచ్చిన పలువురు స్థానిక బిజెపి పార్లమెంటు సభ్యుడు అనంత కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నరేంద్ర మోడీ సభకు భారీగా వచ్చిన ప్రజలు సొంత పార్టీ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం. కర్నాటక ఎన్నికల పైన మోడి ప్రభావం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే... కర్నాటక రాజధాని బెంగళూరులో చాలాసీట్లలో బిజెపి గెలిచింది. దానికి కారణం.. ఆయా నియోజకవర్గ అభ్యర్థులు గ్రౌండ్ వర్క్ చేయడంతో పాటు మోడీలా తమకంటూ నియోజకవర్గాలలో ఓ గుర్తింపును ఏర్పర్చుకోవడమే. పలువురు మోడీ పేరును ఉపయోగించుకున్నారు.
తమ గెలుపు క్లిష్టంగా ఉన్నదని భావించిన పలువురు నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ ద్వారా గెలిచేందుకు ప్రచారంలో ఆయన పేరును ఉపయోగించారు. 2008లో యశ్వంతాపూర్ నియోజకవర్గం నుండి శోభాకరంద్లాజె బిజెపి తరఫున గెలుపొందారు. శోభ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతో వెళ్లినప్పటికీ అక్కడ బిజెపి బలపడే ప్రయత్నాలు చేయలేదంటున్నారు. శోభ వెళ్లినప్పటికీ, ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ బిజెపికి అక్కడ నాయకత్వ లేమి కనిపించిందట.
యశ్వంతాపూర్ను బిజెపి పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, వదిలేసుకున్నట్లుగానే కనిపించిందంటున్నారు. ఎన్నికల సమయంలో కూడా అక్కడ అంత సీరియస్గా ప్రచారం చేయలేదట. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలో తేల్చుకోలేని పరిస్థితి ఎదురయిందట. కర్నాటక ఎన్నికల ఫలితాల నుండి బిజెపి గుణపాఠం నేర్చుకొని వచ్చే ఎన్నికలలో పార్టీ తరఫున ఆయా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉందంటున్నారు.
బిజెపి నరేంద్ర మోడీ ప్రభంజంనం తమకు కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు. కానీ పోలింగ్ బూతులోకి ఓటు వేసేందుకు వెళ్లే వ్యక్తి నరేంద్ర మోడీని కాకుండా స్థానిక నేతను చూసి ఓటు వేస్తారు. మోడీ పట్ల అభిమానం గల ఓటరు కూడా స్థానిక అభ్యర్థిని చూశాకే ఓటేస్తారు. బిజెపి స్థానిక అభ్యర్థుల విషయంలో జాగ్రత్త పడకుండా నేతల పైనే నమ్మకం పెట్టుకుంటే మరోసారి ఢిల్లీ పీఠం దూరమయ్యే అవకాశాలున్నాయంటున్నారు.