బొత్స మాట: వైయస్ జగన్ పార్టీ చేతిలో తూటా

కళంకిత మంత్రులు అనే పదాన్ని వ్యతిరేకించడానికి వారు చేస్తున్న వాదన వైయస్ జగన్కు ఉపయోగపడే విధంగా ఉంది. మంత్రులపై ఆరోపణలు మాత్రమే వచ్చాయి. వారిపై సిబిఐ అభియోగాలు మాత్రమే మోపిందని, అభియోగాలు రుజువు కాలేదు కాబట్టి కళంకిత అనే పదం వాడవద్దని వారు వాదిస్తున్నారు. అదే సమయంలో వైయస్ జగన్ ధనదాహానికి మంత్రులు బలయ్యారని అంటున్నారు. జగన్ దోచుకున్నాడని ఆరోపిస్తున్నారు. నిజానికి, జగన్పై సిబిఐ అభియోగాలు మాత్రమే మోపింది. నేరం రుజువు కాలేదు కాబట్టి జగన్ను దోషిగా చిత్రీకరించడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తప్పు పడుతున్నారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైయస్ జగన్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ దోచుకున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెసు నాయకులంతా ఆయన తప్పు చేశాడనే మాట్లాడుతున్నారు. తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల అక్రమాలకు జగన్ పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణల కారణంగానే జగన్ అరెస్టయ్యాడు. అభియోగాలు రుజువయ్యేంత వరకు జగన్పై తీవ్రమైన ఆరోపణలు ఎలా చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రశ్నించడానికి సిద్ధపడుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోలపై మంత్రులను సుప్రీంకోర్టు తప్పు పట్టడం ఇప్పుడు కాంగ్రెసుకు మింగుడు పడని వ్యవహారంగా మారింది. ఆ మంత్రులను విచారించాలని సుప్రీంకోర్టు సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంత్రులు ఆరుగురు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ మంత్రి పదవికి రాజీనామా చేసి, జైలులో ఉండగా, ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలపై సిబిఐ నిందితులుగా కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో పేర్కొంది.
మరో ముగ్గురు మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మినారాయణ, జె. గీతారెడ్డి పేర్లను కూడా చార్జీషీట్లలో సిబిఐ చేర్చవచ్చుననే ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్కు సంబంధించిన వ్యక్తే సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెసు నాయకులు ఇప్పుడు గుర్రుమంటున్నారు. ఏమైనా, జగన్ తాను చిక్కుల్లో పడిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూడా ఇబ్బందులు పెట్టేందుకే అలా చేసి ఉంటారని అనుకోవడం సహజమే. అది జరిగి ఉండవచ్చు కూడా. మొత్తం మీద, కాంగ్రెసు పార్టీ చిక్కుల్లో పడినట్లే అనిపిస్తోంది.












Click it and Unblock the Notifications