నో ప్యాచప్: చంద్రబాబుకు హరికృష్ణ దూరమే
చాలా కాలంగా హరికృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, పాదయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు హరికృష్ణతో విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు నందమూరి హీరో బాలకృష్ణ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, అటువంటి ప్రయత్నాలు ఏవీ జరగలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్పాయి.
మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, హరికృష్ణ మెట్టు దిగడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. చంద్రబాబు చుట్టూ చేరిన కోటరీ తనపై, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్పై తప్పుడు ప్రచారం సాగిస్తున్నారనే ఆగ్రహంతో హరికృష్ణ ఉన్నట్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించారని హరికృష్ణ అంటున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి కుటుంబ సభ్యులతో కలవడానికి అంత సుముఖంగా లేరని అంటున్నారు. బాలకృష్ణ ఆయనపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో హరికృష్ణకు సయోధ్య కుదరడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది.