ఆదేశిస్తే పోటీ: తారకరత్న, సాయితో దర్శనంపై వివరణ

తారక రత్న, విజయ సాయి రెడ్డి కుటుంబ సభ్యులు కలిసి శనివారం చిత్తూరు జిల్లాలోని తుమ్మల వెంకటేశ్వర స్వామి వారిని, ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విజయ సాయితో కలిసి దైవ దర్సనానికి రావడంపై తారకరత్న స్పందించారు. రాజకీయాలు వేరు.. కుటుంబం వేరన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరఫునే ప్రచారం చేస్తానని చెప్పారు.
ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత నందమూరి బాలకృష్ణకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేసేందుకు సిద్ధమని తారక రత్న ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు.
కాగా, మే 27, 28 తేదీల్లో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు కూడా తారకరత్న హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనకు కౌంటర్ ఇచ్చాడు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని, అంది ఉంటే మహానాడుకు వెళ్లి ఉండేవాడినని, ఇప్పుడు పిలిచినా వెళ్తానని జూనియర్ ఎన్టీఆర్ మే 28వ తేదీన తాత ఎన్టీ రామారావుకు నివాళి అర్పించిన సందర్బంగా మీడియా ప్రతినిధులతో అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనతో తారకరత్న విభేదించారు. మహానాడుకు రావడానికి ఆహ్వానం అవసరం లేదని. తాతా ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తలుపులు నందమూరి కుటుంబ సభ్యులకు తెరిచే ఉంటాయని, పార్టీ కోసం పనిచేయడం నందమూరి కుటుంబ సభ్యుల బాధ్యత అని ఆయన అన్నారు. ఈ మాటలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.












Click it and Unblock the Notifications