అసెంబ్లీకి దూసుకొచ్చిన రాములమ్మ, కిందపడ్డ శ్రవణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్లను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా ఆమె అసెంబ్లీ దరిదాపులకు చేరుకున్న విజయశాంతి అసెంబ్లీ వైపుకు దూసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు, విజయశాంతి మధ్య తీవ్ర తోపులాట జరిగింది. విజయశాంతి అసెంబ్లీ వరకు రావడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఇందిరాపార్కు వద్ద కోదండరామ్ను, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ను, బిజెపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేస్తోందని కోదండరామ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. తాము తమ నిరసనను కొనసాగిస్తామని, రేపు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.
ఆర్టీసి క్రాస్ రోడ్డు వద్ద ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ సమయంలో తెరాస నేత శ్రవణ్ తోపులాటలో కిందపడ్డారు. దీంతో అతను సొమ్మసిల్లి పడ్డారు. అతనికి నీళ్లు తాగించిన నేతలు స్పృహలోకి తెచ్చారు. అనంతరం ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
అసెంబ్లీ వైపు దూసుకొస్తున్న సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలను, విమలక్కను తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలలో పోలీసులు హైదరాబాదు రాకుండా తెలంగాణవాదులను అరెస్టు చేశారు.
రవీంద్ర భారతి వద్ద తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత మహిళా ఎమ్మెల్యేలు జై తెలంగాణ అంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోల్కోండ పిఎస్లో ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీని నిర్వహించారు.
ఓయులో ఉద్రిక్తం
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అసెంబ్లీ వైపుకు వస్తుండగా పోలీసులు ఎన్సీసి గేటు వద్ద అడ్డుకోగా రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు వారిని ముళ్లకంచెలు అడ్డు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఓయు పిఎస్ పైన విద్యార్థులు రాళ్ల వర్షం కురిపించగా పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
పౌరుషం లేదు: కడియం
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలకు పౌరుషం లేదని కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణ కంటే పదవులు ముఖ్యమా అని ప్రశ్నించారు. మన రాజధానికి మనల్నే రానీయకుంటే ఎలా అని, తెలంగాణ వ్యతిరేక ప్రజాప్రతినిధులను గ్రామాల్లో నిలదీయాలని సూచించారు.