వరదల బీభత్సం: కేదార్నాథ్లో మిగిలింది ఏమీ లేదు
న్యూఢిల్లీ: వరద బీభత్సానికి కేదార్నాథ్ నిర్మానుష్యంగా మారింది. ఆలయం తప్ప అక్కడ ఏమీ మిగలేదు. కేదార్నాథ్లోని ప్రజలనందరినీ ఖాళీ చేయించినట్లు ఐటిబిపి చీఫ్ అజయ్ చద్ధా చెప్పారు. ఎంత మంది చనిపోయారనే విషయంపై ఆయన నోరు విప్పలేదు. కేదార్నాథ్కు వెళ్లడానికి కూడా మార్గం లేకుండా పోయిందని ఆయన చెప్పారు. హెలికాప్టర్ల ద్వారా ప్రజలను అక్కడి నుంచి తరలించారు.
ఇంత దారుణమైన స్థితిని తాను ఎప్పుడూ చూడలేదని మహారాష్ట్రలోని గోండియాకు చెందిన సీతారాం సుఖాఠియా అన్నారు. అతను నిలబడలేని స్థితిలో ఉన్నాడు. 12 గంటల పాటు అతను ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్నాడు. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు అక్కడ దాదాపు 8 వేల మంది ఉన్నారు. ఆలయం వద్ద ఇప్పుడు జీవి అనే మాట లేదు. కూలిపోయిన నిర్మాణాల చెత్త ఆలయం చుట్టూ చేరిపోయింది.

హోటళ్లు, దుకాణాలు, ఇళ్లు - ఏమీ లేవని సీతారాం చెప్పారు. వరదల నుంచి తప్పించుకోవడానికి అతను కాలినడకన ధరాలీ చేరుకున్నాడు. మనుషులు, పశువులు, గ్యాస్ సిలిండర్లు నది వరదలో కొట్టుకుపోవడాన్ని అతను చూశాడు. మహారాష్ట్రకు చెందిన సాక్షి, సుమిత్ బన్సాల్ దంపతులు 49 మంది యాత్రికుల్లో భాగంగా కేదార్నాథ్ వచ్చారు. పరిస్థితిని వివరించే సమయంలో వారిద్దరు ఏడ్చేశారు. గంగోత్రి ఉగ్రరూపం దాల్చడంతో వారిద్దరు తమ బేబీతో ధరాలీలోని హోటల్లో ఉన్నారు. వారిని సహాయక బృందాలు అక్కడికి చేర్చాయి.
హోటల్ కూడా వరదల తాకిడికి గురైందని, ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించామని వారు చెప్పారు. ఎక్కడ చూసినా నీళ్లే కనిపించాయని, కొన్ని బిస్కట్లు మాత్రం తినడానికి మిగిలాయని, మంచినీళ్లు దొరకలేదని సుమిత్ చెప్పాడు. బతుకుపై ఆశ వదిలేశామని, ఐఎఎఫ్ హెలికాప్టర్లు తమను కాపాడాయని ఆయన చెప్పారు.
మూడేళ్ల పాటు చార్ ధామ్కు యాత్రికులు కష్టమే..
మూడేళ్ల పాటు కేదార్నాథ్కు గానీ బద్రీనాథ్కు గానీ యాత్రికులను అనుమతించే పరిస్థితి లేదని అధికారులు గురువారంనాడు చెప్పారు. భారీ వర్షాలతో, వరదలతో ఆ రెండు ఆలయాలు కూడా చాలా దెబ్బ తిన్నాయని అధికారులు చెప్పారు. బురద, విధ్వంసం, మరణాలు తప్ప మరేమీ అక్కడ లేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications