తెలంగాణ, సీమాంధ్ర నేతల ఒత్తిడి: బొత్స ఏం చెప్తారు?

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచితే ఏం చేయాలి? విభజిస్తే ఏం చేయాలి? అనేది సూచిస్తూ రోడ్ మ్యాప్ రూపొందించాలని దిగ్విజయ్ సూచించారు. నివేదికను ఉమ్మడిగా కానీ, విడివిడిగా కానీ ఇచ్చే స్వేచ్ఛను ఇచ్చారు. కిరణ్ సమైక్యవాదిగా ముద్రపడ్డారు. దామోదర తెలంగాణవాది. బొత్స వైఖరి మాత్రం అందరికీ ఉత్కంఠను కలిగిస్తోంది. బొత్స ప్రత్యేక వాదానికి సానుకూలంగా ఉన్నారని, పలుమార్లు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని తెలంగాణ నేతలు గుర్తు చేస్తున్నారు.
అయితే ఆయన సమైక్యవాదేనని, రాజమండ్రిలో ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన సమైక్యవాద సభకు హాజరు కావడమే అందుకు నిదర్శనమని సీమాంధ్రనేతలు అంటున్నారు. మరోవైపు బొత్సపై ఒత్తిడి పెంచాలని ఎంపీలు కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్ సీమాంధ్ర నేతలకు గట్టిగా సూచించారు. దీంతో కన్వీనర్ శైలజానాథ్ నేతృత్వంలో బొత్సను కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అధిష్ఠానానికి నివేదికను ఇవ్వాలని కోరేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా దామోదర రాజనరసింహ, జానారెడ్డి తదితరులు తెలంగాణ వైపే మొగ్గు చూపాల్సిందిగా బొత్సపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ బొత్స మాత్రం ఎలాంటి నివేదికలు ఇవ్వకుండా కోర్ కమిటీ సమావేశంలో మౌఖికంగా తన అభిప్రాయాన్ని వెల్లడించే పనిలో ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది.












Click it and Unblock the Notifications