తిరుమలలో మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం- వచ్చే మూడు నెలల్లో
కలియుగ వైకుంఠ తిరుమల కొండలపై పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది. గ్రీన్ ఎనర్జీని సమకూర్చుకునేలా నూతన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తిరుమలలో నూతన విండ్ టర్బైన్ ఏర్పాటు కానుంది. ముంబైకి చెందిన ఓ ప్రముఖ రవాణా, మౌలిక సదుపాయాల సంస్థ ఈ అత్యాధునిక టర్బైన్ను టీటీడీకి విరాళంగా ఇవ్వనుంది. జీఎన్సీ నర్సరీ సమీపంలో గల 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రక్కనే ఈ విండ్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి టీటీడీ 1.39 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
దీని ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు 16 లక్షల యూనిట్ల పవన విద్యుత్ ఉత్పత్తి అవుతుందని టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎల్ఎల్పీ అనే సంస్థ సుమారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో ఈ 800 కిలోవాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా టీటీడీకి ఏటా సుమారు రూ. 1.45 కోట్ల కరెంటు బిల్లుల భారం తప్పుతుంది. మూడు నెలల్లో ఈ నూతన టర్బైన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న తొమ్మిది విండ్ మిల్స్ కు ఇది అదనం.

ప్రస్తుతం తిరుమలలో వసతి గృహాలు, ఆలయాలు, ఇతర సేవల అవసరాల కోసం టీటీడీ ప్రతి సంవత్సరం సుమారు ఆరు కోట్ల యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తోంది. ఇందులో దాదాపు కోటి యూనిట్ల విద్యుత్ను ఇప్పటికే ఉన్న పవన విద్యుత్ కేంద్రాల సహాయంతో సొంతంగా ఉత్పత్తి చేసుకుంటోంది. మిగిలిన అయిదు కోట్ల యూనిట్లను ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి కొనుగోలు చేస్తోంది. ఈ విండ్ టర్బైన్ ఏర్పాటైన అనంతరం ఈ కొనుగోలు వ్యయం గణనీయంగా తగ్గుతుంది.
టీటీడీతో కుదిరిన కాంట్రాక్ట్ ప్రకారం.. విష్ విండ్ ఇన్ ఫ్రా సంస్థే ఈ టర్బైన్ను ఉచితంగా అందజేస్తుంది. దీన్ని స్థాపించడం మొదలుకుని రాబోయే 25 సంవత్సరాల పాటు ఎలాంటి అదనపు భారం లేకుండా ఉచితంగానే నిర్వహిస్తుంది. పాతికేళ్ల సుదీర్ఘ కాలపరిమితిలో దీనివల్ల టీటీడీకి దాదాపు రూ. 36.32 కోట్లు ఆదా అవుతాయనే అంచనాలు ఉన్నాయి.
సాధారణంగా ఒక మెగావాట్ సౌర విద్యుత్ కేంద్రాన్ని స్థాపించి, ప్రతి సంవత్సరం 15 లక్షల యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయడానికి అయిదు నుండి ఆరు ఎకరాల విస్తీర్ణం అవసరమవుతుంది. ఈ పవన విద్యుత్ విధానంలో మాత్రం పరిమిత స్థలంలో.. అంటే 1.39 ఎకరాల్లోనే 16 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయితే.. ఈ నూతన టర్బైన్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటును నేరుగా టీటీడీకి చెందిన 11 కేవీ ఫీడర్కు అనుసంధానిస్తారు.




Click it and Unblock the Notifications