జగన్ భయంతోనే పంచాయతీ ఎన్నికలు: విజయమ్మ
వరంగల్: తమ పార్టీ అధ్యక్షుడు, తన కుమారుడు వైయస్ జగన్ జైలు నుంచి బయటకు వస్తే ప్రమాదమని గుర్తించే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయలక్ష్మి అన్నారు. వరంగల్లో బుధవారం నిర్వహించిన పార్టీ 'పంచాయతీ సమ్మేళన్' సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తొలుత తెలంగాణ అమరవీరులకు, చార్ధామ్ మృతులకు, జవాన్ల మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.
వైయస్ జగన్ భయంతోనే కాంగ్రెస్ పంచాయతీతో పాటు నవంబర్లోగా సాధారణ ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపుతుందని ఆమె అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలపై విజయలక్ష్మి తన ప్రసంగంలో తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని, ఆ తరువాత వదిలేస్తారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలు తమ పార్టీకి కీలకమని, విజయం కోసం తీవ్రంగా కృషి చేయాలని శ్రేణులకు సూచించారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న కాంగ్రెసు ప్రభుత్వానికి హాలిడే ప్రకటించాలని ఆమె వ్యాఖ్యానించారు. పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, మిల్క్ హాలిడేలు ప్రకటించిన ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications