ధర్మాన, సబితలకు చుక్కెదురు: కౌంటర్కు ఆదేశాలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితులైన మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు కోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. తమపై సిబిఐ దాఖలు చేసిన సిడీలపై వారు చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సిబిఐ సమర్పించిన సిడీలు అస్పష్టంగా ఉన్నాయని, ఒరిజినల్ సీడిలను సమర్పిస్తేనే కౌంటర్ దాఖలు చేస్తామని వారిద్దరు కోర్టుకు విన్నవించుకున్నారు.
వారి విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు సిబిఐ దాఖలు చేసిన సిడీలు సక్రమంగానే ఉన్నాయని చెబుతూ ఈ నెల 12వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు బయట వుంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని చెబుతూ వారిని జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.

తమ ఆరోపణలకు సాక్ష్యంగా సిబిఐ కోర్టుకు రెండు సిడీలను సమర్పించింది. ఆ సీడిలపైనే సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒరిజినల్ సీడిలు సమర్పిస్తేనే కౌంటర్ దాఖలు చేస్తామని వారు కోర్టుకు చెప్పుకున్నారు. దీంతో దానిపై విచారణ జరిపిన కోర్టు సీడిలు సక్రమంగానే ఉన్నాయని, ఈ నెల 12వ తేదీన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ సబితా ఇంద్రారెడ్డిని, ధర్మాన ప్రసాదరావును నిందితులుగా చేర్చింది. దీంతో వారిద్దరు కూడా తమ మంత్రి వదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ధర్మాన ప్రసాదరావును వాన్పిక్ వ్యవహారంలో దాఖలు చేసిన చార్జిషీట్లో, సబితా ఇంద్రారెడ్డిని దాల్మియా వ్యవహారంలో దాఖలు చేసిన చార్జిషీట్లో సిబిఐ నిందితులుగా చేర్చింది.












Click it and Unblock the Notifications