సిటీ లైట్ విషాదం: 32 గంటల తర్వాత సేఫ్గా పిల్లి

భవనం కుప్పకూలడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. శిథిలాలను తొలగిస్తూ దానికింద చిక్కుకున్నవారిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నించాయి. సోమవారంనాడు 13 మంది మృతదేహాలు బయటపడగా, మంగళవారంనాడు మరో ఐదు మృతదేహాలను వెలికి తీశారు.
మంగళవారంనాడు శిథిలాల కింది నుంచి ఓ పిల్లి ప్రాణాలతో బయటపడింది. బయటకు వచ్చిన పిల్లి చాలా అలసిపోయినట్లు కనిపించింది. అది ఓ వ్యక్తి అరచేతిలో పట్టిన నీళ్లను చప్పరించి దాహం తీర్చుకునే ప్రయత్నం చేసింది. భవనం కూలి ఘటనలో హోటల్ సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు.
సిటీ లైట్ ప్రమాదం నేపథ్యంలో నగరంలోని పాత భవంతులను జిహెచ్ఎంసి అధికారులు కూల్చి వేస్తున్నారు. మోండా మార్కెట్, మంగళ్ హాట్ ప్రాంతాలలో జిహెచ్ఎంసి అధికారులు భవనాలను కూల్చి వేస్తున్నారు. సిటీ లైట్ హోటల్ భవనాన్ని ఆనుకొని ఉన్న భవనాన్ని కూల్చి వేయాలని జిహెచ్ఎంసి అధికారులు నిర్ణయించారు. పాత భవనాలను ఉపేక్షించేది లేదని కమిషనర్ కృష్ణబాబు తేల్చిచెప్పారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగబోమని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications