తెరాసలోకి టిడిపి రెబెల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి
1985 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వేణుగోపాలచారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇటీవల తెలంగాణపై తెలుగుదేశం పార్టీ వైఖరిని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తెరాస ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించారంటూ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఆయనపై తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. వేణుగోపాలాచారిపై వేటు వేయాలని కోరింది.
ప్రస్తుతం ఎమ్మెల్యే వేణుగోపాలచారి అనర్హత వేటు విషయాన్ని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెండింగ్లో ఉంచారు. తెలుగుదేశం పార్టీకి దూరమైన వేణుగోపాలచారి నాగం జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ నగారా సమితితో పనిచేస్తూ వస్తున్నారు. ఇటీవల నాగం జనార్దన్రెడ్డి నగారాను బీజేపీలో విలీనం చేయడంతో వేణుగోపాలచారి ఒంటరిగా మారారు.
తెలంగాణ వాదిగా మొదటి నుంచి పేరున్న చారికి కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా వేణుగోపాలచారి తెరాసలో చేరేందుకు మార్గం సుగమమైంది.