సోనియా చెప్పడమే తరువాయి: తెలంగాణపై షిండే
మంగళవారం జైపాల్ రెడ్డితో, షిండే సుమారు 40 నిమిషాలపాటు భేటీ అయ్యారు. తెలంగాణపై సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకోగానే దాని అమలుకు తమ శాఖ చర్యలు తీసుకుంటుందని షిండే చెప్పినట్లు తెలిసింది. తాను రాజకీయ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నానని షిండే చెప్పారు. సోనియాగాంధీ అన్నింటికంటే ఎక్కువగా తెలంగాణకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరలో స్పష్టమైన పరిష్కారం చూపాల్సిందిగా ఆదేశించారని షిండే చెప్పినట్లు తెలిసింది.
సోనియాతో పాటు అంతా అనుకూలంగా ఉన్నారని, అన్ని అంశాలను బేరీజు వేసిన తర్వాతే ఆమె ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన అన్నారు. రాజకీయ నిర్ణయం తర్వాత ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంటుందని, మేడమ్ నిర్ణయాన్ని అమలు చేయడమే నా బాధ్యత' అని షిండే చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ రాజకీయంగా రాష్ట్రంలో, ఆ తర్వాత దేశంలో నిలదొక్కుకోవాలంటే తెలంగాణ ఏర్పాటు తప్ప మరోమార్గంలేదని షిండేకు జైపాల్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వడంవల్ల ఇప్పటి వరకూ రాజకీయ ప్రాధాన్యం లభించని అనేక వర్గాలకు అవకాశం లభిస్తాయని ఆయన చెప్పారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ అనేక సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదని, సామాజిక న్యాయం జరిగితే కాంగ్రెస్ కూడా బలోపేతమవుతుందని చెప్పారు.