తెలంగాణ: అసదుద్దీన్ లేఖతోనే మలుపు తిరిగిందా?
ఈసారి పంపిన లేఖలో రాజకీయ అంశాలను ఎక్కువగా అసదుద్దీన్ ప్రస్తావించినట్లు సమాచారంమంటూ మీడియా వార్తలు చెబుతున్నాయి. పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ ఇస్తే యూపీఏకు కలిగే ప్రయోజనాలు, రాయలసీమలోని రెండు జిల్లాలను కలుపుతూ రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఒనగూరే ప్రయోజనాలను ఆయన ఈ లేఖలో వివరించినట్లు తెలుస్తోంది.
రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే ఎన్నికలు ఎప్పుడు జరిగినా 52 అసెంబ్లీ స్థానాల్లో యుపిఎ భాగస్వామ్య పక్షాలు విజయం సాధించవచ్చని ఆయన లేఖలో రాసినట్లు తెలుస్తోంది. రాయల తెలంగాణ ప్రాంతంలో మైనార్టీలు, దళితులు, రెడ్డి సామాజిక వర్గాల ప్రాబల్యం ఎలా ఉందనే విషయాన్ని ఆయన గణాంకాల్లో పొందు పరిచినట్లు సమాచారం.
దాంతో భవిష్యత్తులో కూడా తెలంగాణలో బిజెపి బలపడకుండా చూడవచ్చని ఆయన అందులో చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాయల తెలంగాణ ఏర్పాటుకు అసక్తి చూపడానికి అసద్ లేఖ ప్రభావం ఉందనే ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తూ రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు మజ్లీస్ పార్టీ పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే.
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తమ అభిప్రాయాన్ని కేంద్రానికి ఎప్పుడో నివేదించామని, తాజాగా అదే విషయాన్ని మళ్లీ లేఖ ద్వారా ప్రధానికి తెలిపామని అసదుద్దీన్ స్పష్టం చేశారు. తమ అభిప్రాయాలను ఇతర పార్టీలు రకరకాలుగా చెప్పడంతో అయోమయం ఏర్పడుతుందని భావించి స్పష్టత కోసం పాత లేఖను పంపామని వివరణ ఇచ్చారు.