తెలంగాణ: వైయస్ సంతకాన్ని ఎత్తిచూపిన ప్రధాని
మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం - 2004కు ముందు వైయస్ రాజశేఖ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, తెలంగాణ ఇవ్వాలంటూ 32 మంది ఎమ్మెల్యేలతో చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియా గాంధీకి పంపిన లేఖను ప్రధాని గుర్తు చేశారు. అందులో వైఎస్ సంతకం కూడా ఉంద ని ఆయన చెప్పారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం లేదని, తెలుగుదేశం పార్టీ అప్పట్లో విభజనకు అనుకూలం కాదని, అలాంటి పరిస్థితుల్లో ఈ అంశాన్ని కదిలించింది మన పార్టీవాళ్లే కదా అని, మేడమ్ సోనియా ఇదే అడుగుతున్నారని ప్రధాని అన్నట్లు సమాచారం
సోనియా గాంధీ నిర్ణయించిన తర్వాత తాను ఏమీ చేయలేనని, కావాలంటే సోనియా మనసు మార్చడానికి ప్రయత్నించాలని ఆయన అన్నట్లు చెబుతున్నారు. దాంతో పాటు తెలంగాణ కావాలనేందుకు అనేక కారణాలు చూపుతున్నారని, సమైక్యానికి సరైన కారణాలేవీ చూప లేకపోతున్నారని ప్రధాని అన్నట్లు చెబుతున్నారు.
కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, చిరంజీవి, పళ్లంరాజు, పురందేశ్వరి, ఎంపీలు అనంత వెం కట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు శనివారం ప్రధానిని కలిశారు. రాజీనామాలు చేస్తామనే సీమాంధ్ర నాయకుల తీరుపై మన్మోహన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు కదా, ఇప్పుడు ఇదేమిటని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
దాదాపు అన్నిపార్టీలూ తమ అభిప్రాయం చెప్పినప్పుడు కాంగ్రెసు మాత్రం ఎంతకాలం మౌనం వహిస్తుందని మన్మోహన్ సింగ్ ప్రశ్నించారు. తెలంగాణతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనీ తాను అనడంలేదని, సాధ్యమైనంత వరకు పరిస్థితి చక్కబడుతుందని ఆయన అన్నారు.