తెలంగాణ: కిరణ్ రెడ్డిపై సోనియా గాంధీ ఆగ్రహం?
రాష్ట్ర విభజనపై శుక్రవారం వార్ రూమ్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చర్చలు జరిపారు. రాష్ట్ర విభజనకు అవసరమైన ప్రక్రియలో పాలు పంచుకోవాలని చెప్పారు. అయితే, తాను విభజన బాధ్యతను మోయలేనని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఆ విషయాన్ని సోనియా గాంధీతో చెప్పాలని ఆజాద్ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పినట్లు సమాచారం. దాంతో ఆ రోజు సోనియా గాంధీని కలుసుకోవడానికి ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు ఆజాద్ జోక్యంతో సోనియా గాంధీ ఆయనకు ఐదు నిమిషాల సమయం ఇచ్చారు. తన అభిప్రాయాన్ని చెప్పి, రాజీనామా లేఖను ఇవ్వడంతో కిరణ్ కుమార్ రెడ్డిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇన్నాళ్లు తమకు అనుకూలంగా ఉంటున్నట్లు ఎందుకు వ్యవహరించారని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఎందుకు చెప్పారని సోనియా గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిని నిలదీసినట్లు చెబుతున్నారు. సోనియాతో భేటీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత పెద్దగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖం కళ తప్పిందని మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.