పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తాం: దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: తెలంగాణపై తుది నిర్ణయం సిడబ్ల్యుసి తుది నిర్ణయాన్ని వెలువరించింది. దీనికి ఢిల్లీ వేదిక అయింది. మంగళవారం సాయంత్రం ఏడు గంటల తర్వాత సిడబ్ల్యుసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేసి, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు అజయ్ మాకెన్ సమావేశానంతరం చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై తన తుది నిర్ణయాన్ని వెలువరించింది.. తొలుత నాలుగు గంటలకు యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం, ఐదున్నర గంటలకు సిడబ్ల్యుసి సమావేశం జరిగాయి. ఆతర్వాత అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేశారు.
- తెలంగాణకు చెందిన పది జిల్లాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ సింగ్ స్పష్టంగా చెప్పారు.
- హైదరాబాదులో సీమాంధ్రుల భద్రతకు ప్రభుత్వం చట్టం చేస్తుంది.
- రాజ్యాంగపరమైన అంశాలను కేంద్ర మంత్రివర్గం పరిశీలిస్తుంది.
-
న్యాయశాఖ
బిల్లును
రూపొందిస్తుంది.
అసెంబ్లీలో
తీర్మానం
సంగతి
ఎలా
ఉన్నా
పార్లమెంటులో
బిల్లు
ప్రతిపాదిస్తాం
- తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు.
- సీమాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా చేయాలని సూచించాం. పదేళ్ల లోపు ఆంధ్ర రాష్ట్రం కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది.
- తెలంగాణకు, ఎన్నికలకు సంబంధం లేదని దిగ్విజయ్ ప్రకటన
- నాలుగైదు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు.
- సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్గా పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్య
- ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల్లోని ఆందోళనను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు
- నదీజలాలు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇతర డిమాండ్లకు మాదిరిగా చూడలేమని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
- గోదావరిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణంచి, తగిన నిధులను కేంద్రం కల్పిస్తుందని అజయ్ మాకెన్ చెప్పారు.
- సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు మాకెన్ చెప్పారు.
- పదేళ్ల పాటు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని.
- తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెసు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది.
- సిడబ్ల్యుసి సమావేశం తీర్మానాన్ని ప్రకటిస్తున్న అజయ్ మాకెన్
- తెలంగాణపై సిడబ్ల్యుసి తీర్మానం విషయం బయటకు రాగానే తెలంగాణ ప్రాంతమంతా సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రజలు రోడ్ల మీదికి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే సంబరాలు చేసుకుందామని తెలంగాణ జెఎసి చేసిన ప్రకటనను కూడా వారు పట్టించుకోవడం లేదు.
- తెలంగాణపై సిడబ్ల్యుసి చేసిన నిర్ణయాన్ని కాసేపట్లో దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించనున్నారు. తెలుగువారికి ఇక రెండు రాష్ట్రాలు ఏర్పడనున్నాయి.
- తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యుసి ఏకవాక్య తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశం గంట పాటు సాగింది.
- తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హైదరాబాద్లోని తెలంగాణ అమర వీరుల స్థూపం గన్ పార్కుకు చేరుకోనున్నారు.
- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
- సిడబ్ల్యుసి సమావేశం ముగిసింది. కొద్ది సేపట్లో తెలంగాణపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సిడబ్ల్యుసి సమావేశం గంటపాటు సాగింది.
- తెలంగాణపై సిడబ్ల్యుసి సమావేశంలో ప్రతిపాదించిన తెలంగాణ తీర్మానం ముసాయిదా ప్రతులతో కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఎపి భవన్కు వెళ్లిపోయారు.
- కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణలకు సిడబ్ల్యుసిలో ప్రతిపాదించే తెలంగాణ ముసాయిదా తీర్మానాన్ని అందజేశారు. సిడబ్ల్యుసిలో ఏకవాక్య తీర్మానానికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
- సిడబ్ల్యుసి సమావేశానంతరం సాయంత్రం ఏడు గంటలకు తెలంగాణపై ఎఐసిసి కీలకమైన ప్రకటన చేస్తుందని సమాచారం.
- పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక విభాగం కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం ప్రారంభమైంది. సోనియా సహా 22 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.
- హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా అంగీకరించబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సీనియర్ నేత కె. కేశవ రావు హైదరాబాదులో అన్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తర్వాతనే నమ్ముతామని ఆయన అన్నారు.
- తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న నేతలతో హైదరాబాదులో సమావేశమయ్యారు. తెలంగాణపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యుపిఎ సమన్వయ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. జాతీయ చానెళ్లలో కూడా ఇదే వార్త వస్తోంది. యుపిఎ భాగస్వామ్య పక్షం ఆర్ఎల్డి అధినేత అజిత్ సింగ్ ఆ విషయాన్ని ధ్రువీకరించారు.
- ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, సోనియాలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ సమావేశమయ్యారు.
- యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు యుపిఎ భాగస్వామ్య పక్షాల నేతలు పాల్గొన్నారు. సమావేశం 50 నిమిషాల పాటు సాగింది. సమావేశం వివరాలపై అధికారికంగా ఓ ప్రకటన వెలువడనుంది. సమావేశం వివరాలపై ప్రకటన విడుదల చేస్తారని ఎన్సీపి నేత శరద్ పవార్ చెప్పారు.
- తెలంగాణపై యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నివాసంలో జరుగుతున్న సమావేశానికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రులు చిదంబరం, గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, కమలనాథ్, ఎన్సీపి నేత శరద్ పవార్, ఆర్ఎల్డి నేత అజిత్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్జుల్లా, ముస్లీంలీగ్ నేత అహ్మద్ హాజరయ్యారు. రాహుల్ గాంధీ కూడా సమావేశానికి హాజరయ్యారు.
- తెలంగాణ ఇస్తే విదర్భ కూడా ఇవ్వాలని సిడబ్ల్యుసి సమావేశంలో అడుగుతామని కాంగ్రెసు ఎంపి విలాస్ ముతైమ్వార్ అన్నారు.
- యుపిఎ సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతోంది. సోనియా గాంధీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు.
- తాను రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో సమావేశమైన తర్వాత ఆయన ఆ విధంగా అన్నారు.
- తెలంగాణ నిర్ణయం వల్ల సీమాంధ్రకు అన్యాయం జరగదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. ఆంధ్ర ప్రాంతానికి ఏ విధమైన బలగాలను పంపించలేదని చెప్పారు. తెలంగాణ డిమాండ్ 1956 నుంచి ఉందని షిండే అన్నారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రతిపక్ష నేత, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్కు ఫోన్ చేసి కోరారు. ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ ఫోన్ చేసి బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డికి తెలిపారు. కిషన్ రెడ్డి హైదరాబాదులో ఈ విషయాన్ని వెల్లడించారు.
- తెలంగాణపై సిడబ్ల్యుసి సమావేశంలో నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చునని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు.
- డిజిపి దినేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. అంతకు ముందు ఇరువురు సమావేశమై చర్చలు జరిపారు.
- కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
- తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ స్థితిలో వెనక్కి వెళ్లలేమని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సీమాంధ్ర నాయకులకు చెప్పినట్లు సమాచారం. మీ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూస్తామని, ఆందోళన చెందవద్దని ఆమె సీమాంధ్ర నేతలతో చెప్పారు. సీమాంధ్ర నేతలు రాహుల్ గాంధీని కూడా కలిశారు. తొందర పడి ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని వారిద్దరు కూడా వారికి సూచించారు.
- సోనియాతో తుది దశలో సీమాంధ్రకు చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు చర్చలు జరిపారు.
- .యుపిఎ సమన్వయ కమిటీ సమావేశానికి ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రధాని మన్మోహన్ సింగ్తో సమావేశం కానున్నారు.
- రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రకు చెందిన 15 మంది మంత్రులు రాజీనామాలు చేస్తారని సీమాంధ్రకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు. కాసేపట్లో తమ రాజీనామా లేఖలను సమర్పిస్తామని ఆయన చెప్పారు. గంటా శ్రీనివాస రావు కేంద్ర మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. అనుకోని నిర్ణయం వస్తే సాయంత్రం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు.
- తాజా పరిణామాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో అందుబాటులో ఉండాలని పార్టీ శాసనసభ్యులను ఆదేశించారు.
- కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆహ్వానం మేరకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎపి భవన్కు చేరుకున్నారు. ఆయనను కలిసేందుకు కాంగ్రెసు తెలంగాణ నేతలు వచ్చారు.
- దిగ్విజయ్ సింగ్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సీమాంధ్ర నేతలు నిరాశకు గురయ్యారు. సీమాంధ్ర నేతలు సోనియా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి చిరంజీవి, పురంధేశ్వరి, పల్లంరాజు, లగడపాటి రాజగోపాల్ హాజరయ్యారు.
- తాము తెలంగాణకు వ్యతిరేకమని ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రకటించింది. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.
- కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్, కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు.
- సిడబ్ల్యుసి సభ్యుడు హరిప్రసాద్ను తెలంగాణ నాయకులు కలుసుకున్నారు. తెలంగాణపై మంగళవారం సాయంత్రం జరిగే సిడబ్ల్యుసి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న విషయం తెలిసిందే.
- రాహుల్ గాంధీతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు, నేతలు భేటీ కానున్నారు.
- ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశమయ్యారు. సాయంత్రం జరిగే యుపిఎ సమన్వయ కమిటీ, సిడబ్ల్యుసి సమావేశాల ఎజెండాపై చర్చకే ఈ భేటీ అని తెలుస్తోంది.
- దిగ్విజయ్ సింగ్తో సమావేశం తర్వాత సీమాంధ్ర నేతలు ఢిల్లీలో కెవిపి రామచందర్ రావు నివాసంలో సమావేశమయ్యారు. సమైక్యవాదనను సిడబ్ల్యుసి ముందుంచుతానని దిగ్విజయ్ సింగ్ చెప్పారని సీమాంధ్ర ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. రాజీనామాలు చేస్తామని ఎవరు చెప్పారు, రాజీనామాలు పరిష్కారం కాదని ఆయన అన్నారు.
- హైదరాబాద్లోని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పి) కార్యాలయంలో సీమాంధ్ర నాయకులు సమావేశమయ్యారు.
- తెలంగాణకు చెందిన పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం ఢిల్లీకి రానున్నారు.
- తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎలాంటి అపోహలకు తావు లేదని ఢిల్లీకి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో తెలంగాణకు చెందిన ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
- తెలంగాణకు వెనక్కి పోతే తాము కూడా ఆహార భద్రత బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తామని తెలంగాణ నేతలు హెచ్చరించారు. తాము కూడా అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధమైనట్లు వారు తెలిపారు.
- కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్తో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు. ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారో చెప్పాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఏమైందని వారు అడిగారు. ఏకపక్ష నిర్ణయాన్ని సహించబోమని వారు హెచ్చరించారు. రాష్ట్రాల పునర్విభజన సంఘం (ఎస్సార్సీ) ద్వారానే రాష్ట్ర విభజన జరగాలని అంటున్నారు. దిగ్విజయ్ సింగ్తో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఐదుగురు పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు.
- సమైక్యాంధ్రకు అనుకూలంగా సీమాంధ్రలో విద్యాసంస్థల బంద్ జరుగుతోంది. పలు ప్రాంతాల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.
- విభజనపై నిర్ణయం జరుగుతుందని అనుకోవడం లేదని, సమైక్యాంధ్ర కోసం చివరి క్షణం వరకు ప్రయత్నిస్తామని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు.
- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరారు.
- పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు.
- సీమాంధ్ర నేతలు మంగళవారం ఉదయం పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు నివాసంలో సమావేశమయ్యారు. తనకు మీసాలు ఉన్నాయి గానీ తెలంగాణను ఆపే దమ్ము లేదని కనుమూరి బాపిరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనను ఆపేందుకు సీమాంధ్ర నాయకులు చివరి ప్రయత్నాలు సాగిస్తున్నారు.
- తెలంగాణ మంత్రులు కె. జానా రెడ్డి, సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, డికె అరుణ, పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు.
- మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి వెళ్లనున్నారు.