బెంగాల్లో అడ్డుకుంటే ఢిల్లీలోనే తేల్చుకుంటా..! మమత సీరియస్ వార్నింగ్..!
పశ్చిమబెంగాల్లో ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..వరుసగా విపక్ష టీఎంసీ నేతల్ని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా రెండు రోజుల్లోనే ఇద్దరు ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కళ్యాణ్ బెనర్జీలపై బీజేపీ కార్యకర్తలు రోడ్డుపైనే దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో రేపు కోల్ కతాలో బహిరంగసభ నిర్వహించాలని మమతా బెనర్జీ (Mamata Banerjee) నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ నేతలంతా తరలిరావాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఈ సభకు బీజేపీ సర్కార్ అనుమతి నిరాకరించింది.
దీనిపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కోల్ కతాలో ర్యాలీ నిర్వహించేందుకు పోలీసులు అనుమతించకపోతే తాను ఢిల్లీకి వెళ్లి ఒంటరిగా నిరసన తెలుపుతానని మమత వార్నింగ్ ఇచ్చారు. వర్చువల్గా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో.. మంగళవారం కోల్కతాలోని రాణి రష్మోని రోడ్లో నిరసన తెలిపేందుకు టీఎంసీ అనుమతి కోరిందని, అయితే పోలీసులు దానిని నిరాకరించారని మమత ఆరోపించారు. ఇది రాజకీయ ప్రేరేపిత నిర్ణయం అన్నారు.

తాను ఆందోళనను కొనసాగిస్తానని, అవసరమైతే జాతీయ రాజధానిలో కూడా నిరసన తెలుపుతానని ఆమె స్పష్టం చేశారు. బెదిరింపులు, అరెస్టుల ద్వారా టీఎంసీ కార్యకర్తలను బలహీనపరిచేందుకు పోలీసులు బీజేపీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 'పోలీసు పాలన' నడుస్తోందని, టీఎంసీ రాజకీయ కార్యకలాపాలను అధికారులు పద్ధతి ప్రకారం అణచివేస్తున్నారని ఆరోపించారు. సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి టీఎంసీకి పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని, అయినా తాము బలంగా ఎదుగుతామని తెలిపారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను లాక్కోవడంతో టీఎంసీ బలహీనపడదన్నారు. తమ కార్యకర్తలను సమావేశాలు నిర్వహించనివ్వడం లేదని, తమను బయటకు రానివ్వడం లేదని మమత తెలిపారు. 2,500 పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారని, ఈద్గాలను స్వాధీనం చేసుకున్నారని, మిషనరీ సంస్థలను మూసివేశారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications